చంద్రబాబు హయాంలోనే డిప్యూటేషన్కు అప్లయ్ చేసుకున్న ఐపీఎస్ అధికారులు:ఆర్టీఐ
అమరావతి: ఏపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో సివిల్ సర్వీస్ అధికారులు డిప్యూటేషన్పై కేంద్ర సర్వీసులకు వెళ్లాలని భావిస్తున్నట్లు టీడీపీ మండిపడింది. ఇందులో మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ కూడా కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారనే వార్త షికారు చేస్తోంది.
డిప్యూటేషన్కు అప్లయ్ చేసుకున్న ఏడుగురు ఐపీఎస్ ఆఫీసర్లు
ఏపీ సివిల్ సర్వీసెస్ అధికారులు డిప్యూటేషన్కు దరఖాస్తు చేసుకుంటున్నారని వస్తున్న వార్తలపై కేంద్ర హోంశాఖ స్పందించింది. 2014 నుంచి 2020 వరకు కేవలం 7 మంది ఐపీఎస్ ఆఫీసర్లు మాత్రమే కేంద్ర సర్వీసులకు డిప్యూటేషన్పై వచ్చేందుకు మొగ్గు చూపారని స్పష్టం చేసింది. ఏపీ నుంచి ఎంత మంది సివిల్ సర్వీస్ అధికారులు డిప్యూటేషన్ వైపు మొగ్గు చూపారో చెప్పాలంటూ ఆర్టీఐ ద్వారా పిటిషన్ దాఖలైంది. దీనికి సమాధానంగా కేంద్ర హోం వ్యవహారాల శాఖ చీఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఏకే సరన్ సమాధానం ఇచ్చారు.
కేంద్ర సర్వీసులకు దరఖాస్తు చేసుకుంది వీరే
ఇక డిప్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న ఏడుగురి ఐపీఎస్ అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి. 1998 బ్యాచ్ ఐపీఎస్కు చెందిన విక్రమ్ సింగ్ 2014 ఫిబ్రవరి 24 డిప్యూటేషన్కు దరఖాస్తు చేసుకోగా... 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు 2015 జనవరి 9న దరఖాస్తు చేసుకున్నారు. ఇక 1987 బ్యాచ్ ఐపీఎస్కు చెందిన తుషార్ ఆదిత్య త్రిపాఠీ 2018 ఏప్రిల్ 17న కేంద్ర సర్వీసులకు డిప్యూటేషన్పై పంపాలని దరఖాస్తు చేసుకోగా... 1986 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన వీఎస్కే కౌముది 2016 ఫిబ్రవరి 23న దరఖాస్తు చేసుకున్నట్లు కేంద్ర హోంవ్యవహారాల శాఖ పేర్కొంది.
రెండు సార్లు దరఖాస్తు చేసుకున్న అంజనా సిన్హా
మరోవైపు 1979 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఎస్ఏ హూడా 2016 మార్చి 3న కేంద్ర సర్వీసులకు దరఖాస్తు చేసుకోగా.. 1990 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన అంజన సిన్హా 2016 జనవరి 3న దరఖాస్తు చేసుకున్నారు. మళ్లీ 2017 డిసెంబర్ 26వ తేదీన అంజనా సిన్హా అప్లయ్ చేశారు. ఇక సంతోష్ మెహ్రా కూడా రెండు సార్లు కేంద్ర సర్వీసులకు అప్లయ్ చేసుకున్నారు. 2018 సెప్టెంబర్ 11న ఒకసారి, 2019 మార్చి 23న రెండోసారి దరఖాస్తు చేసుకున్నారు.తొలుత ఆయన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలాట్ చేయగా ఇప్పటికీ తెలంగాణలోనే పనిచేస్తున్నారు. 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుకు ముందుగా ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా పోస్టింగ్ ఇవ్వగా ఆ తర్వాత ఏసీబీ డీజీగా పోస్టింగ్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.
చంద్రబాబు హయాంలోనే ...
మొత్తానికి కేంద్ర సర్వీసులకు డిప్యూటేషన్పై వెళ్లాలనుకునే ఐపీఎస్ ఆఫీసర్లంతా చంద్రబాబు హయాంలోనే దరఖాస్తులు చేసుకున్నట్లు కేంద్ర హోం వ్యవహారాల శాఖ ఆర్టీఐ ద్వారా వచ్చిన అప్లికేషన్కు సమాధానం ఇచ్చింది. ఇక జగన్ సర్కార్ వచ్చాక ఏ ఒక్క ఐపీఎస్ అధికారి కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకోలేదని స్పష్టం చేసింది.