ఇక జనసేనలో అంతా కొత్త రక్తమే..! కొండల్ని పిండి చేసే యువతకు స్వాగతమంటున్న గబ్బర్ సింగ్..!!
అమరావతి/హైదరాబాద్: జనసైన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వినూత్నంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీని సంసిద్దం చేస్తున్నారు గబ్బర్ సింగ్. అందుకోసం కృషి, పట్టుదల ఉన్న యువ నేతల కోసం ఆయన అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీలో పాత నీరు వెళ్లిపోయి కొత్తనీరు వస్తేనే జోష్ ఉంటుందని, సమూల మార్పులు అప్పుడే చోటుచేసుకుంటాయని పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చవి చూసిన నేతల నైరాశ్యాన్ని పార్టీకి అంటకుండా జాగ్రత్త పడుతున్నారు పవన్ కళ్యాణ్. వారి స్థానంలో కొండలను పిండిచేసే నవ యవ్వన యువకులను పార్టీలోకి ఆహ్వానించి స్థానిక సమరానికి బరిలో దింపబోతున్నారు జనసేనాని.
Recommended Video
యువతకు ప్రాధాన్యం..!పార్టీ సమూల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్..!!
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంతో డీలా పడిన కేడర్, నాయకుల్లో మనోధైర్యం నింపడంతో పాటు 2024 ఎన్నికలే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేయడానికి జనసేనాని పవన్ కల్యాణ్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా పార్టీలో నాయకత్వ సమస్య అధికంగా ఉందన్న ఉద్దేశంతో ఇతర పార్టీల్లో ప్రజాదరణ ఉన్న నేతలను జనసేనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేసేందుకు సిద్ధమయ్యే నాయకులెవరినైనా తీసుకుంటామని పార్టీలోని కీలక నేతలకు తెలియజేశారు. ఈ వారంలో నాలుగు రోజుల పాటు విజయవాడలో బస చేసిన ఆయన ముఖ్య నేతలతో సమీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. వారిలో కొంత మంది.. కొత్త వారిని తీసుకునే విషయంలో మరికొంత సమయం వేచి చూద్దామని సలహా ఇచ్చారు. దీనిపై జనసేనాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ప్రజాదరణ ఉన్న యువతను తీసుకుందాం..!తన నిర్ణయం కాదంటే కఠిన నిర్ణయాలేనన్న సేనాని..!!
'పార్టీ పరిధి పెంచొద్దా..? ఎప్పుడూ మీరు, మీ వాళ్లేనా..? పార్టీలోకి కొత్త నీరు రావాలి. అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యమివ్వాలి. నా నిర్ణయాన్ని ఎవరైనా కాదు.. కుదరదంటే కఠిన నిర్ణయాలు ఉంటాయి. నాయకత్వ సమస్య వల్లే సార్వత్రిక ఎన్నికల్లో ఇబ్బందులు పడ్డాం. 2014 ఎన్నికల సమయంలో నేనొక్కడినే ఉన్నాను. 2014 తర్వాత మీరు కొంత మంది వచ్చారు. 2024 ఎన్నికల్లోపు పార్టీ పరిధిని మరింత పెంచాలి. ఇప్పటి నుంచే ప్రజాదరణ ఉన్న నాయకులను తీసుకుంటే మంచిది. ఐదేళ్ల తర్వాత వారే పార్టీకి బలమైన నేతలుగా తయారవుతారు' అని చెప్పుకొచ్చారు గబ్బర్ సింగ్.
స్థానిక సమరానికి సన్నద్ధం..! యువ నేతలతో కాటమ రాయుడి ప్రయోగం..!!
దీంతో సమావేశంలో ఉన్న నాయకులంతా మౌనంగా ఉండిపోయారని తెలిసింది. ఇదే సమయంలో వంగవీటి రాధా చేరికపై పవన్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. వచ్చే నెల మొదటివారంలో పవన్ తానా మహాసభలకు అమెరికా వెళ్లనున్నారు. తిరిగి వచ్చాక రాధాతో పాటు మరికొంత మందిని పార్టీలోకి ఆహ్వానించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికలకు కేడర్ను, నేతలను సమరోన్ముఖులను చేసేందుకు పవన్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. జూలై రెండోవారం నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆ సందర్భంగా పార్లమెంటరీ నియోజకవర్గాలవారీగా సమీక్ష జరుపుతారు.
అమెరికా నుంచి తిరిగొచ్చాక కొత్త నాయకులకు ఆహ్వానం..! పార్టీలో నూతన జోష్ నింపై ప్రయత్నం..!!
ప్రతి నియోజకవర్గానికీ రెండు రోజులు కేటాయిస్తారు. పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులతో పాటు క్షేత్రస్థాయిలో గట్టిగా పని చేసిన ముఖ్య నాయకులతో ఆయన భేటీ అవుతారు. జూలై మొదటి వారంలో పవన్ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. తిరిగి రాగానే పర్యటనలు మొదలవుతాయి. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని పవన్ భావిస్తున్నారు. ముందుగా భీమవరం, గాజువాక, అనంతపురంలో కార్యాలయాలు ప్రారంభించాలని నిర్ణయించారు కాటమ రాయుడు.