వైసీపీ ఎంపీల సంచలన నిర్ణయం.: మూడు నెలల వేతనం పీఎం, సీఎం రిలీఫ్ ఫండ్లకు కేటాయింపు..
అమరావతి: రాష్ట్రంలో క్రమంగా విస్తరిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ను నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోన్న ముందుజాగ్రత్త చర్యల కోసం విరాళలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం లోక్సభ సభ్యులు కేశినేని నాని, కింజరాపు రామ్మోహన్ నాయుడు తమ ఎంపీల్యాడ్స్ నిధుల నుంచి భారీ మొత్తాన్ని దీనికోసం కేటాయించారు. తాజాగా- అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు కూడా ముందుకొచ్చారు. తమ మూడు నెలల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరించింది. మిగిలిన దేశాలతో పోల్చుకుంటే మృతుల సంఖ్య చాలా తక్కువే అయినప్పటికీ.. దీని బారిన పడి మరణించే వారి సంఖ్యను తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృత చర్యలను తీసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం 15 వేల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. జగన్ సర్కార్ కూడా.. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐసొలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. లాక్డౌన్ను ప్రకటించింది.
ఈ సందర్భంగా తలెత్తే ఆర్థిక ఒడిదుడుకులను కాస్తయినా తగ్గించడానికి విరాళాలను ప్రకటిస్తున్నారు రాజకీయ నాయకులు. తెలుగుదేశం పార్టీ లోక్సభ్యుడు కేశినేని నాని అయిదు కోట్ల రూపాయల మొత్తాన్ని కలెక్టర్కు అందజేశారు. టీడీపీకే చెందిన మరో ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు 70 లక్షల రూపాయల నిధులను ప్రకటించారు. ఇక వైఎస్ఆర్సీపీకి చెందిన పార్లమెంట్ సభ్యులందరూ తమ మూడు నెలల వేతనాన్ని కరోనా నివారణ చర్యల కోసం చెల్లించనున్నారు.
రెండు నెలల వేతన మొత్తాన్ని ప్రధానమంత్రి సహాయ నిధికి అందజేయనున్నారు. మరో నెల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి చెల్లించనున్నారు. ఈ మేరకు లోక్సభలో వైఎస్ఆర్సీపీ సభా పక్ష నాయకుడు మిథున్ రెడ్డి, పార్లమెంటరీ పార్టీ చీఫ్ వీ విజయసాయి రెడ్డి వెల్లడించారు. త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలను కలిసి తమ వేతన మొత్తంతో కూడిన చెక్కును వారు అందజేయనున్నారు.