అలాంటి మహిళపై అసభ్య వ్యాఖ్యలా?: చిరంజీవి ఏం చేశారంటూ పవన్పై నాని ఫైర్
ఏలూరు: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఆళ్ల నాని తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడుతూనే ప్రజలను మభ్య పెట్టేందుకు పవన్ నాటకాలాడుతున్నారని ఆరోపించారు.
ప్రజల సంక్షేమం కోసం పాటుపడే వైయస్ జగన్ గురించి పవన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. భీమవరంలో సమస్యలపై చర్చకు రావాలంటూ జగన్ను ప్రశ్నించడం పవన్ అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.
జగన్ను విమర్శించే అర్హత లేదు
భీమవరంలో నాలుగు రోజులుగా మకాం వేసిన పవన్ ఒక్కసారి కూడా తుందుర్రు ఎందుకు వెళ్లలేదని ఆళ్ల నాని ప్రశ్నించారు. తుందుర్రు పోరాట సమితి ఎన్నిసార్లు తమ గోడు వెళ్లబోసుకున్నా కొంచెం కూడా స్పందించని పవన్కు జగన్ను విమర్శించే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల గురించి ఆలోచిస్తారు గనుకే జగన్ తుందుర్రులో పర్యటించారని తెలిపారు. ఆక్వా ఫ్యాక్టరీ వల్ల జరిగే నష్టం గురించి ఆయన దృష్టికి రావడంతో అసెంబ్లీలో లేవనెత్తారని గుర్తు చేశారు.
పవన్కు నాని సవాల్
పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధికి బీజం వేసింది దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి అని ఆళ్ల నాని అన్నారు. జిల్లా అభివృద్ధిపై చర్చించడానికి తాను సిద్దంగా ఉన్నానన్న నాని.. దమ్ముంటే పవన్ గానీ, జనసేన నాయకులు గానీ చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు.
చిరంజీవి ఏం చేశారు?.. అలాంటి మహిళపై విమర్శలా?
రెండేళ్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన చిరంజీవి జిల్లాకు చేసిన మేలేంటో చెప్పాలని నాని డిమాండ్ చేశారు. టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తారు గనుకే పోలవరం గురించి పవన్ ఒక్కమాట కూడా మాట్లాడటం లేదని ఆరోపించారు. అనైతిక రాజకీయాలకు పాల్పడే సంస్కృతి ఉన్నందునే.. జగన్ కుటుంబంలోని మహిళ గురించి జనసేన సైనికులు ఇష్టం వచ్చినట్లుగా కామెంట్లు చేస్తున్నారని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసైనికులు అసభ్య వ్యాఖ్యలు చేసిన 48గంటల తర్వాత.. అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని చెప్పడం దారుణమని అన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన ఆ మహిళపై ఇలాంటి అసభ్య వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు.
టీడీపీ, పవన్కు గుణపాఠమంటూ హెచ్చరిక
ఎంపీలను కూడగట్టి ప్రత్యేక హోదా కోసం పోరాడతానంటూ ప్రగల్భాలు పలికే పవన్.. ఢిల్లీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఢిల్లీలో ఆమరణ నిరాహార చేసినపుడు మాత్రం మొహం చాటేశారని నాని విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా మా పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదని, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి, ఆ పార్టీకి అండగా నిలిచే పవన్ లాంటి వ్యక్తులకు సరైన గుణపాఠం చెబుతారని ఆళ్ల నాని హెచ్చరించారు.