'ఓటుకు నోటులో చంద్రబాబుపై పూర్తి ఆధారాలు': సుప్రీం కోర్టులో ఇలా..
న్యూఢిల్లీ: ఓటుకు నోటు కేసులో సుప్రీం కోర్టు తీర్పు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తరఫు న్యాయవాది సుధాకర్ శుక్రవారం నాడు స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టేలతో ఈ కేసు దర్యాఫ్తును ఆపాలని చూశారని చెప్పారు.
4 వారాల్లోనే లేదంటే..: సుప్రీంలో ఓటుకు నోటుపై బాబుకు షాక్, జోక్యం చేసుకోమని ఆళ్లకు షాక్
అయితే నాలుగు వారాలలోగా ఓటుకు నోటు కేసును పరిష్కరించాలని సుప్రీం కోర్టు ఆదేశించిందని, ఇది మంచి పరిణామమని అభిప్రాయపడ్డారు. నాలుగు వారాలు దాటితే తిరిగి తమ వద్దకు రావొచ్చునని చెప్పిందని అన్నారు.
సుప్రీం కోర్టులో వాదనలు ఇలా...
ఓటుకు నోటు కేసులో సుప్రీం కోర్టులో వాదనలు వాడిగా వేడిగా జరిగాయి. చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూథ్రా, ఆళ్ల తరఫున శేఖర్ నాప్డే వాదనలు వినిపించారు.
ప్రాథమిక వాదనలు ముగియగానే స్టే అండ్ నోటీసు ఉత్తర్వులను ధర్మాసనం ఇచ్చింది. కేసు దర్యాఫ్తు జరగకుండా హైకోర్టు ఇచ్చిన స్టే పైన తొలుత కోర్టు స్టే ఇచ్చింది. అయితే స్టే ఉత్తర్వులు ఇవ్వగానే బాబు లాయర్ మళ్లీ వాదనలు వినిపించారు.
ఏపీ సీఎంపై రాజకీయ దురుద్దేశ్యాలతో కేసు పెట్టారని లూథ్రా పేర్కొన్నారు. ఒక ఎఫ్ఐఆర్లో దర్యాఫ్తు సాగుతుండగా మరో ఎఫ్ఐఆర్ ఎలా వేస్తారన్నారు. ఏసీబీ కోర్టు సెక్షన్ 156, 210 కింద ఆదేశాలు ఇచ్చిందని, ఆ కోర్టు ఆదేశాల పైన తాము హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నామన్నారు.
ఆ సమయంలో లూథ్రాను సుప్రీం జడ్జి పలు ప్రశ్నలు అడిగారు. అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన కేసులో స్టే ఎలా ఇస్తారన్నారు. వేటి ఆధారంగా ఈ కేసులో హైకోర్టు స్టే ఇచ్చిందన్నారు. దాంతో దర్యాఫ్తు పై హైకోర్టు 8 వారాల స్టే ఇచ్చిందని చెప్పారు. ఇప్పటికే మూడు వారాలు పూర్తయిందన్నారు.
అందువల్ల హైకోర్టులోనే కేసు కొనసాగించమని చెప్పాలని ఆయన కోరగా, ఆయన వాదనతో సుప్రీం కోర్టు ఏకీభవించలేదు. నాలుగు వారాల్లోగా ఈ కేసును పరిష్కరించాల్సిందిగా హైకోర్టును ఆదేశిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. ఆ సమయంలో ఏసీబీ, ఏపీ సీఎం అంటూ చంద్రబాబు న్యాయవాది మరోసారి వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు.
ఆ తర్వాత వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల తరఫు న్యాయవాది శేఖర్ వాదన ప్రారంభించారు. ఒక కేసు దర్యాఫ్తును ఆపమని చెప్పడం సబబు కాదని, అవినీతి కేసులో స్టేకు వీల్లేదన్నారు. ఏసీబీ కోర్టులో చంద్రబాబు పాత్రపై పూర్తి ఆధారాలు ఉన్నాయని, ఛార్జీషీటులో చంద్రబాబు పాత్ర లేనందువల్లే మళ్లీ దర్యాఫ్తు కోరామన్నారు.
చంద్రబాబు పాత్రను పరోక్షంగా ప్రస్తావించారని, ఆయన విషయంలో దర్యాఫ్తుపై మెతక వైఖరితో ఉన్నారని తెలిపారు. ప్రజా జీవితంలో నైతికత, నిబద్ధత అత్యంత ఆవశ్యమన్నారు. హైకోర్టులో అడ్డుకోవడం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు. నాలుగు వారాల్లో హైకోర్టు పరిష్కరించకుంటే ఎలా అన్నారు. దానికి ధఱ్మాసనం కచ్చితంగా నాలుగు వారాల్లో పరిష్కరించాలని ఆదేశించింది.