దురుసు ప్రవర్తన: జగన్ పార్టీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి అరెస్ట్
పెనుమాక కేసులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.
అమరావతి: పెనుమాక కేసులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. పెనుమాకలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో మినిట్స్ రాయాలంటూ తన ముందున్న టేబుల్ పక్కకు తోసేశారు రామకృష్ణా రెడ్డి, ఆ తర్వాత అధికారులు వాగ్వాదానికి దిగారు.అంతేగాక, ఆయన అనుచరులు కుర్చీలను విరగ్గొట్టి, టెంట్లను కూల్చేశారు.
దీంతో తమతో దురుసుగా ప్రవర్తించారంటూ సీఆర్డీఏ అధికారులు కేసు పెట్టారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే సహా 14 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేశారు. కాగా, స్టేషన్ బెయిల్పై ఎమ్మెల్యే ఆర్కే విడుదలయ్యారు.
సీఎం చంద్రబాబు ఒత్తిడి వల్లే అధికారులు తనపై కేసు పెట్టారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం అరాచకాలపై న్యాయపోరాటం చేస్తానని ప్రకటించారు. భూ సేకరణ చట్టాన్ని, కోర్టు ఆదేశాలను చంద్రబాబు సర్కారు పట్టించుకోవడం లేదని విమర్శించారు.
భూ కబ్జాలపై సిట్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మినిట్స్ బుక్ రాయమన్నందుకు కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. తన ఎంపీలు, ఎమ్మెల్యేలు అధికారులపై దాడులు చేస్తే తప్పులేదు కానీ, మినిట్స్ బుక్ రాయమంటే తప్పా? అని రామకృష్ణా సీఎం చంద్రబాబును నిలదీశారు.