చంద్రబాబు ర్యాంక్ ఎంత?: ఎమ్మెల్యేలకు ర్యాంకులపై వైసీపీ
అమరావతి: అవినీతి అక్రమాల్లో తన తర్వాత ఏ మంత్రి, ఏ ఎమ్మెల్యే ఏ ర్యాంకులో ఉన్నారో చంద్రబాబు ప్రకటిస్తే బాగుండేదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మూడు రోజుల పార్టీ కార్యకర్తల శిక్షణా తరగతుల్లో భాగంగా ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా చంద్రబాబు ర్యాంకులు కేటాయించిన సంగతి తెలిసిందే.
అవినీతిలో రాష్ట్రం దేశంలోనే నంబర్వన్లా ఉండే విధంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం చంద్రబాబుదేనని ఆయన ధ్వజమెత్తారు. తన రెండున్నర ఏళ్ల పాలనలో ప్రజలు ఇచ్చిన ర్యాంకులో చంద్రబాబు ప్రభుత్వం ఫెయిల్ అయిందని వ్యాఖ్యానించారు.
పేకాట, మద్యం బెల్టు దుకాణాల నిర్వహణ, ఇసుక, మట్టి క్వారీలను ఎలా దోచుకోవాలనే దానిపై గుంటూరు జిల్లాలోని కేఎల్ యూనివర్సిటీలో మూడు రోజులు మంత్రులు, ఎమ్మెల్యేలకు శిక్షణ ఇచ్చారని విమర్శించారు. రాష్ట్రంలోని ఇసుక, మట్టి క్వారీలను టీడీపీ ఎమ్మెల్యేలు, బంధువులు దోచుకుంటుంటే చంద్రబాబుకు కనపడకపోవడం శోచనీయమని అన్నారు.
నకలీ విత్తనాలు విక్రయించిన వారిపై పీడీ యాక్టు పెడతామని, రైతులంతా తమ పంటలను నష్టపోయాక చంద్రబాబు ప్రకటించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. తన నియోజకవర్గంలోనే జాతీయ రహదారుల వెంట 44 బార్లు, రెస్టారెంట్లు నడుస్తున్నాయని తెలిపారు.
వాటి చాటున వేలాదిగా బెల్టు దుకాణాలు నడుస్తున్నాయని వాటిని అరికట్టడంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు. దీని వెనుక టీడీపీ నేతల ఒత్తిడి ఉందని వ్యాఖ్యానించారు. ఇక డాబాల విషయానికి వస్తే లెక్కే లేదని పేర్కొన్నారు.
సరైన తనిఖీలు లేకపోవడంతో ఆహారాన్ని తీసుకుంటున్న ఎంతోమంది అనారోగ్యం పాలవుతున్నారని తెలిపారు. జాతీయ రహదారుల వెంబడి బార్లు, డాబాల కారణంగా ఎంతో మంది రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన చెందారు.