సదావర్తి భూములపై కొత్త ట్విస్ట్: రూ.10 కోట్లకు ఆళ్ల రెడీ, బాబుకు షాక్
హైదరాబాద్: సదావర్తి భూముల వ్యవహారంలో కొత్త ట్విస్ట్. ఈ భూముల విషయమై కోర్టు సూచించిన విధంగా తాను రూ.10 కోట్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని, ఆ మొత్తం సిద్ధం చేసుకున్నానని వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తెలిపారు.
సదావర్తి భూములపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో వేలంలో వచ్చిన సొమ్ముకు రూ.5 కోట్లను అదనంగా ఇస్తామని, తొలి విడతగా రూ. 10 కోట్లు చెల్లించేందుకు తన క్లయింటు అంగీకరిస్తున్నారని ఆళ్ల తరఫు న్యాయవాది కోర్టులో తెలిపారు.
సదావర్తి ట్విస్ట్: అళ్ల రెడీ, నారా లోకేష్ ఐటి బెదరింపులు
ఆ డబ్బును దేవాదాయ శాఖకు ఇవ్వాలని, డబ్బు చెల్లించినట్టు ఆ శాఖ కమిషనర్ నుంచి రసీదు తీసుకుని తమకు ఇవ్వాలని కోర్టు ఈ సందర్భంగా సూచించింది. రెండు వారాల్లో రూ.10 కోట్లు చెల్లించాలని చెప్పింది. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది.
కాగా, గుంటూరు జిల్లా అమరావతిలోని సదావర్తి సత్రానికి తమిళనాడులో ఉన్న 83 ఎకరాల భూములను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామమాత్రంగా రూ.22.44 కోట్లకు 2016 మార్చి 28న వేలంలో విక్రయించిందని ఆరోపిస్తూ ఎమ్మెల్యే 2016 ఆగస్టులో హైకోర్టును ఆశ్రయించారు.
ఆ వేలాన్ని రద్దు చేసి మొత్తం వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. ఆ భూములకు తాను రూ.5 కోట్లు ఎక్కువ ఇచ్చి తీసుకుంటానని ఆళ్ల కోర్టును ఆశ్రయించారు. అంటే ఆ భూములకు రూ.27.44 కోట్లు ఇచ్చేందుకు ఆళ్ల సిద్ధమయ్యారు. ఇది టిడిపి ప్రభుత్వానికి పెద్ద షాక్ అని చెప్పవచ్చు.