మరో'సారీ': నెక్లెస్, పట్టుచీర.. మంత్రి పీతల సుజాతకు రహస్య కానుక?
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పీతల సుజాత మరోసారి వార్తల్లోకెక్కారు. కర్నూలు జిల్లాకు వచ్చిన మంత్రి పీతల సుజాతకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఉద్యోగులు రహస్యంగా కానుకలు సమర్పించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
కర్నూలులోని పద్దెనిమిది మంది సిడిపీవోలు ఒక్కొక్కరు రూ.5వేల చొప్పున భరించి మొత్తం రూ.90వేలతో మంత్రి సుజాతకు రహస్య బహుమతులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
మంత్రి సుజాతకు వారు పట్టుచీరతో పాటు డాలర్తో కూడిన బంగారు నెక్లెస్ కొనుగోలు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. బుధవారం ప్రభుత్వ గెస్ట్ హౌస్లో వారు సుజాతను కలిశారు. ఈ సందర్భంగా వారు వాటిని అందించారని వార్తలు వస్తున్నాయి.
దీనిని మీడియా గమనించి ఫోటోలు తీసేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారని సమాచారం. దీనిపై మంత్రి పీతల సుజాత, అధికారులు స్పందించవలసి ఉంది.
కాగా, మంత్రి పీతల సుజాత పైన గతంలోను బహుమతుల విమర్శలు వచ్చాయి. ఆమె ఇంటి ముందు కొద్ది నెలల క్రితం ఎవరో డబ్బులు వదిలేసి వెళ్లారు. ఇది ఆమెకు బహుమతిగా ఇచ్చేందుకు తెచ్చినవని అప్పట్లో విమర్శలు వచ్చాయి. అయితే, తనకు వాటితో సంబంధం లేదని అప్పుడు ఆమె చెప్పారు.