ఇదేం తీరు?: దొరికారా.. కండువా కప్పేయడమే?, ఏపీ మంత్రి వింత చేష్టలు!
అయితే వారి సమస్యలను వినాల్సిన మంత్రి రవీంద్ర.. వారి మెడలో టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి కొత్త చేరికలంటూ ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు.
మచిలీపట్నం: అధికార పార్టీకి జై కొడితేనే సమస్యల పరిష్కారమైనా.. అభివృద్ది అయినా!.. అన్నట్లు తయారైంది పరిస్థితి. మొన్నీమధ్యే తన పాలన నచ్చనివారు పెన్షన్లకు దూరంగా ఉండాలని సీఎం హెచ్చరిస్తే.. కండువా కప్పుకుంటేనే మీ గోడు వింటామంటున్నారు మంత్రి కొల్లు రవీంద్ర. దీంతో టీడీపీ వైఖరి పట్ల ప్రజల నుంచి అసహనం వ్యక్తమవుతోంది.
సమస్యలు విన్నవించుకుందామని ఎవరొచ్చినా సరే.. వారి భుజం మీద ఓ కండువా కప్పేసి.. వారిని టీడీపీ కార్యకర్తలుగా తీర్మానించేయడం మంత్రి గారికి అలవాటయిపోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సహాయం కోరితే.. కండువాలు కప్పడమేంటని జనం విస్తుపోతున్నారు. దీంతో రంగంలోకి దిగిన వైసీపీ ప్రెస్ మీట్ పెట్టి మరీ టీడీపీని దులిపేసింది.
తాజాగా కృష్ణా జిల్లా మచిలీపట్నం పరిధిలోని ఎస్ ఎస్ గొల్లపాలెం గ్రామంలో వైసీపీ కార్యకర్తలు దీనిపై ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలు వివరించారు. జులై 2వ తేదీన మంత్రి కొల్లు రవీంద్ర సీతారామపురం గ్రామంలో పర్యటించారని, పర్యటనలో భాగంగా టీడీపీ నేత మట్టా బాలశ్రీనివాస్ ఇంటి వద్ద ఆగారని చెప్పారు. ఆ సమయంలో కొంతమంది ప్రజలు తమ సమస్యలు విన్నవించుకునేందుకు వెళ్లినట్లు తెలిపారు.
అయితే వారి సమస్యలను వినాల్సిన మంత్రి రవీంద్ర.. వారి మెడలో టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి కొత్త చేరికలంటూ ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు. సమావేశంలో వైసీపీ కార్యకర్త కనపర్తి వీరాంజనేయులు మాట్లాడుతూ.. మానసిక వికాలంగురాలైన తన భార్యకు వైద్యం చేయించడానికి ఆర్థిక సహాయం నిమిత్తం మంత్రి వద్దకు వెళ్లానని, కానీ తన సమస్య ఏంటో వినకుండానే తన మెడలో కండువా కప్పేశారని వాపోయారు.
Recommended Video
కార్పోరేషన్ రుణాలు మంజూరైనా.. బ్యాంకులు మాత్రం తమకు ఇవ్వడానికి నిరాకరిస్తుండటంతో.. దానిపై ఫిర్యాదు చేయడానికి వెళ్లినవారికి టీడీపీ కండువాలు కప్పినట్లు వైసీపీ కార్యకర్తలు ఆరోపించారు. ఇక అన్నింటికంటే హాస్యాస్పదం ఏమిటంటే!.. మంత్రి కారు రోడ్డుపై నిలపడంతో.. వెళ్లేందుకు దారి లేక ఓ ట్రాక్టర్ రోడ్డు పక్కన ఆగిపోయింది.
దీంతో వాళ్ల వద్దకు కూడా వెళ్లిన మంత్రి రవీంద్ర.. వారికీ కండువాలు కప్పేశారట. ట్రాక్టర్లో ఉన్నవాళ్లంతా వైసీపీ కార్యకర్తలు కావడంతో.. మంత్రి తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వారికి ఈ కండువాలు కప్పేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.