కుదిపేస్తున్న లీకేజీ ప్రకంపనలు: నారాయణ 'హస్తం'!?, కుట్రం అంటున్న మంత్రి!
దర్యాప్తులో పేపర్ లీకేజీ అయినట్లు తేలిందని వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. దర్యాప్తకు సంబంధించిన పూర్తి వివరాలను బయటపెట్టాలన్నారు.
అమరావతి: పదో తరగతి పరీక్షల్లో లీకుల గోల విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. పట్టించుకోవాల్సిన అధికారులు పైపై చర్యలతో చేతులు దులిపేసుకోవడంతో యథావిధిగా లీకుల బాగోతం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ లీకుల గోలంతా నారాయణ కార్పోరేట్ విద్యాసంస్థ కేంద్రంగా జరిగిందన్న ఆరోపణలు మరింత ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
నారాయణ విద్యాసంస్థల అధినేత ప్రభుత్వ నేత కావడంతోనే ఈ ఆరోపణలపై కంటితుడుపు విచారణతో సరిపెట్టారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. లీకులు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన చోట్ల పలువురు ఇన్విజిలేటర్లను, ఇతర సిబ్బందిని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సస్పెండ్ చేశారు.
మంత్రి నారాయణ-గంటా శ్రీనివాసరావు ఇద్దరు వియ్యంకులు కావడం.. ఒకరి చేతిలో విద్యాశాఖ, మరొకరి చేతిలో కార్పోరేట్ విద్యాసంస్థలు ఉండటం.. ఇద్దరు కలిసి లీకేజీల గుట్టును కప్పి పుచ్చుతున్నారని సాక్షి మీడియా ఆరోపించింది.
నేటి అసెంబ్లీ సమావేశాలను సైతం టెన్త్ పేపర్ లీకేజీ ఘటన కుదిపేసింది. లీకేజీ బాధ్యత వహిస్తూ మంత్రి గంటా శ్రీనివాసరావు, మంత్రి నారాయణ రాజీనామా చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు.
లీకేజీలు ఎక్కడి నుంచి జరిగాయి?
నెల్లూరులోని నారాయణ స్కూల్ నుంచి పదోతరగతి సైన్స్ పేపర్-1ను శనివారం నాడు వాట్సాప్ ద్వారా లీకేజీ చేశారన్న ఆరోపణలున్నాయి. దీంతో చీఫ్ సూపరిండెంట్, సంబంధిత అధికారిపై వేటు వేసిన విద్యాశాఖ దీని వెనుక ఎవరున్నారు అనేదానిపై సమగ్ర విచారణ చేపట్టలేదన్న ఆరోపణలున్నాయి. కొంతమంది ప్రభుత్వ టీచర్లు, నారాయణ సంస్థల వ్యక్తులు కలిసి ఈ కుట్రకు పాల్పడినట్లు చెబుతున్నారు.
తొలిరోజే లీకేజీ:
ఈ నెల 17నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కాగా, తొలిరోజే తెలుగు పేపర్-1 ప్రశ్నాపత్రం లీకైనట్లుగా ఆరోపణలున్నాయి. అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి ఈ పేపర్ లీకైంది. ఆపై అది సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో మరింత కలకలం రేగింది. అయితే ఈ ఘటన వెనుక హిందూపురం నారాయణ పాఠశాలకు చెందిన ఏఓ ముత్యాలు అనే వ్యక్తి ఉన్నాడన్న ఆరోపణలున్నాయి. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
కదిరి నారాయణ పాఠశాలలో:
కదిరి పట్టణంలోని నారాయణ పాఠశాల నుంచి హిందీ ప్రశ్నాపత్రం లీకైనట్లు ఆరోపణలున్నాయి. లీకైన పేపర్ కు జవాబులు సిద్దం చేస్తూ నారాయణ సిబ్బంది మీడియాకు చిక్కినట్లు చెబుతున్నారు. నారాయణ విద్యార్థులు పట్టణంలో ఎక్కడెక్కడైతే పరీక్షలు రాస్తున్నారో.. అక్కడికి ఈ జవాబులు చేరేలా వారు ప్లాన్ చేశారన్నది ప్రధాన ఆరోపణ.
ఇదంతా వైసీపీ కుట్రే: నారాయణ
టెన్త్ పేపర్ లీక్ కాలేదని, లీకైనట్లు వస్తున్న ఆరోపణల వెనుక ప్రతిపక్షం వైసీపీ కుట్ర ఉందని మంత్రి నారాయణ ఆరోపించారు. లీకులు జరిగినట్లు వస్తున్న వార్తలన్ని అవాస్తవమని, ఎవరైనా లీకులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలిచ్చామని అన్నారు.
నేను మంత్రిని కాబట్టే ఈ ఆరోపణలు చేస్తున్నారని, మెడికల్ కాలేజీల్లో సీసీ కెమెరాలు పట్టి పరీక్షలు నిర్వహిస్తున్నామని నారాయణ పేర్కొన్నారు. నారాయణ విద్యాసంస్థలపై ఇప్పటివరకు చిన్న రిమార్క్ కూడా లేదన్నారు.
గంటా, నారాయణ రాజీనామా చేయాల్సిందే:
లీకేజీలన్ని అవాస్తవమని మంత్రి నారాయణ సహా పలువురు టీడీపీ నేతలు చెబుతుంటే.. లీకేజీలు జరిగాయని ప్రతిపక్షం వైసీపీ బలంగా వాదిస్తోంది. వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ ఈ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
దర్యాప్తులో పేపర్ లీకేజీ అయినట్లు తేలిందన్నారు. దర్యాప్తకు సంబంధించిన పూర్తి వివరాలను బయటపెట్టాలన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలు సైతం నారాయణ విద్యాసంస్థల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయని అనిల్ కుమార్ ఆరోపించారు.
మరో వైసీపీ నేత సురేష్ మాట్లాడుతూ.. టెన్త్ పేపర్ లీకేజీపై సీఐడీతో దర్యాప్తు చేయించాలన్నారు. లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారాయణ, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్ తమ పదవులకు రాజీనామా చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది.