"ప.గో లో కలెక్టర్ రాజ్యం..! అంతా టీడీపీ మాఫియా వ్యవహారం"
ఏలూరు : రాజకీయాల్లో బంధుత్వాలు.. వారసత్వాలు పాతుకుపోయిన ఇండియన్ పాలిటిక్స్ లో.. అయినవాళ్ల చేతుల్లోకి అనధికారికంగా అధికార బదలాయింపు జరగడం ఎప్పటినుంచో జరుగుతూనే ఉంది. తాజాగా ఏపీలోను ఇదే పరిస్థితి నెలకొందని అక్కడి విపక్షాలు మొత్తుకుంటున్నాయి. ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ వ్యవహారంపై అక్కడి స్థానికులు సహా, విపక్ష నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప.గో కలెక్టర్ కాటమనేని భాస్కరరావు సీఎం చంద్రబాబుకు దగ్గరి బంధువు కావడంతో.. తన ఇష్టారాజ్యాన వ్యవహారిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేల ఆదేశాలను సైతం లెక్క చేయకుండా.. కేవలం తనకు అనుకూలంగా ఉండే ఇద్దరు ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలకు మాత్రమే ఆయన పనులు చేసిపెడుతున్నారన్న ఆరోపలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.
ఓ టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న పశ్చిమ గోదావరి జిల్లా విపక్ష నేతలు ఈ విషయాల్ని వెల్లడించారు. ప.గో జిల్లా వ్యవహారమంతా కలెక్టర్ రాజ్యంగా మారిపోయిందని.. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కలెక్టర్ కాటమనేనికి బంధువు కావడంతో.. చింతమనేనితో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేల పట్ల మాత్రమే కలెక్టర్ సానుకూలంగా వ్యవహరిస్తున్నారని సీపీఎం కార్యవర్గ సభ్యుడు మంతలి సీతారాం ఆరోపించారు.
కలెక్టర్ గా రాష్ట్ర సమస్యలను పరిష్కరించాల్సింది పోయి టీడీపీ అధ్యక్షుడి తరహాలో కాటమనేని వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు సీతారాం. ఇంత అధ్వాన్నంగా దిగజారిపోయి వ్యవహరిస్తోన్న కలెక్టర్ ను ఇంతవరకు చూడలేదని, జిల్లాలో ఏ చిన్న నిరసన చేపట్టాలన్నా కలెక్టర్ సహించలేకపోతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో ఎక్కడికెళ్లినా టీడీపీ సభ్యత్వ కార్డును జేబులో పెట్టుకుని తిరగాల్సిన దుస్థితిని కలెక్టర్ కల్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీపీఎం నేత సీతారాం వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ.. జిల్లాలో టీడీపీ మాఫియా కొనసాగుతోందన్నారు ఏలూరు కాంగ్రెస్ నేత రామ్మోహన్ రావు. కలెక్టర్ ప్రజాల పక్షాన కాకుండా.. టీడీపీ పార్టీ పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని, టీడీపీలో సైతం తన అనుకూలురకే పనులు చేస్తున్నారన్న విషయాన్ని గతంలో టీడీపీ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణే బయటపెట్టారని గుర్తు చేశారు.