పొత్తు అంశంతో చిత్తవుతున్న తెలుగు తమ్ముళ్లు..!!
హైదరాబాద్/ ఏపి: ఏపీలో పొత్తుల అంశం తెలుగుతమ్మళ్ల మద్య విభేదాలను స్రుష్టిస్తోంది. ఏపిలో ఎన్నికల హడావిడి లేదు.. ముందస్తు హైరానా అంతకన్నా లేదు. పొత్తుల పై సంప్రదింపులు అసలే లేవు. ఊహాజనిత వార్తలను ఆసరాగా చేసుకుని రాజకీయ ప్రకటనలు చేయడం, ఆ ప్రకటనలను మరికొంత మంది నాయకులు ఖండించడం, ఖండిచిన నేతలకు అంత సీన్ లేదని మళ్లీ ప్రకటనలు చేయడం అంతా అంతర్గత విభేదాలను భగ్గుమనేలా చేస్తోంది. పొత్తుల అంశం తాను చూసుకుంటానని, ఎవరు కూడా పొత్తుల అంశంలో ప్రకటనలు గుప్పించి గందరగోళ పరిస్థితులు స్రుష్టించొద్దని చంద్రబాబు చెప్పినప్పటికి ఏపి నాయకులు వినిపించుకోవడం లేదు. కాంగ్రెస్ తో పొత్తు అంశం పై పరస్పర విరుద్ద ప్రకటనలు చేసుకుంటూ యుద్ద వాతావరణాన్ని తలపిస్తున్నారు ఏపి తెలుగు తమ్ముళ్లు..!
కాంగ్రెస్ తో పొత్తు అంశం పై టీడిపిలో మొదలైన రచ్చ.. తెలుగుతమ్ముళ్ల మద్య చిచ్చు..
తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో కలిసేందుకు వడివడిగా అడుగులు వేస్తుంటే ఆ పార్టీ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి కె ఈ కృష్ణమూర్తి తో మరో సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు మాత్రం అంతా తూచ్ అంటున్నారు. కాంగ్రెస్ తో అసలు టీడీపీకి పొత్తు ఉండదని ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం ఆయన టీడీపీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే ఉరేసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బిజెపి, వైసీపీ, జనసేన అందరూ తమ శత్రువులే అని ప్రకటించారు ఆయన. అంతే కాదు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాతే నదుల అనుసంధానం మొదలైందని బాబుకు సన్నాయి నొక్కులు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు.
పొత్తుల గురించి చర్చలే లేవు..! కాని మొదలైన కుమ్ములాటలు..!
తెలుగుదేశం పార్టీలో కాంగ్రెస్ కలకలం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. కాంగ్రెస్ తో కలిస్తే తప్పేంటి అని ప్రశ్నించే వారిని ఏమీ అనని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పొత్తును వ్యతిరేకించే వారిని వారించడం కొంతమందికి నచ్చడం లేదు. ఈ నేపథ్యంలోనే మంత్రులు కెఈ కృష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. అసలు పొత్తు ప్రతిపాదనే లేనప్పుడు ఎవరూ మాట్లాడొద్దని చంద్రబాబు ఆదేశాలు జారీ చేయడం పై విమర్శలు వినిపిస్తున్నాయి. కె ఈ కృష్ణమూర్తి వంటి సీనియర్ నేతలకు వర్ల రామయ్య పద్దతులు చెప్పటంతో ఆయన కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవ్వడం తెలుగు తమ్ముళ్ల మద్య వివాదాన్ని రగిలించింది.
స్థాయి మరిచి ప్రకటనలు..! చంద్రబాబును మించిన మేధావులు..!
తనకు చెప్పటానికి అసలు వర్ల రామయ్య ఎవరు? అని ప్రశ్నించారు. కె ఈ తాజాగా మరోసారి పొత్తు అంశంపై స్పందించారు. తెలుగుదేశం జాతీయ పార్టీ అని, ఇతర రాష్ట్రాల్లో పలు పార్టీలతో టీడీపీ పొత్తులు ఏ విధంగా ఉన్నా ఆంధ్రప్రదేశ్లో మాత్రం కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండబోదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్తో పొత్తు విషయంలో కిందిస్థాయి కేడర్ నుంచి వచ్చిన అభిప్రాయాలనే తాను వెల్లడించానని చెప్పారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగానే ఎన్టీఆర్ పార్టీని స్థాపించారనే విషయం తమ మనస్సుల్లో నాటుకుపోయిందన్నారు. కాంగ్రెస్ పొత్తుపై మాట్లాడినందుకు సీఎం చంద్రబాబు తనను మందలించారనడంలో నిజం లేదని అభిప్రాయపడ్డారు కేఈ.
రాష్ట్ర ప్రయోజనాలకోసం ఎంతకైనా తెలగిస్తానంటున్న బాబు.! అర్థం చేసుకోలేకపోతున్న నాయకులు..!!
కాంగ్రెస్ తో పొత్తు వల్ల పరిస్థితి ఎటువైపు వెళుతుందో అన్న ఆందోళన తెలంగాణ నేతల కంటే ఏపీ టీడీపీ నేతల్లోనే ఎక్కువ ఉంది. తెలంగాణలో టీడీపీ పొత్తుతో కొన్ని సీట్లు సాధించుకోవాలనే వ్యూహంతో తెలంగాణ టీడిపి ముందుకు వెళ్లాలని భావిస్తోంది. . కానీ ఏపీ లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నం. అధికారాన్ని కాపాడుకోవాలంటే పవన్ కళ్యాణ్ రూపంలో పోయిన ఓటు బ్యాంకు..బిజెపితో గత ఎన్నికల సమయంలో కలిసొచ్చిన సానుకూలాంశాలు లేకపోవటం వంటి అంశాలు వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. టీడీపీ పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేకతతో అయినందున ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే నష్టమే ఎక్కువ ఉంటుందన్న భయం సీనియర్ నేతల్లోనూ ఉంది. ఐతే పొత్తు అంశం రాజకీయ ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కువగా ఉంటే చంద్రబాబు ఆ దిశాగా అడుగులు వేసే అవకాశాలు కనిపిపిస్తున్నాయి.