జగన్ వ్యాఖ్యలకు బలమంటూ తేల్చేసిన సాక్షి! బ్రాహ్మణిని కూడా: టీడీపీ ఆగ్రహం వెనుక
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆయనకు చెందిన పత్రిక సాక్షి మీడియాపై టీడీపీ నేతలు బుధవారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. సాక్షిలో వచ్చిన కథనంపై మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షిలో వచ్చిన కథనం వారి తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.
దమ్ముంటే రా!: జగన్కు వంగలపూడి అనిత హెచ్చరిక, 'అలా ఐతే అమరావతి బాండ్లు ఎందుకు'
చేసుకుందాం.. ఆరో పెళ్లి! అంటూ సాక్షిలో కథనం వచ్చింది. ఏపీలో కాంగ్రెస్కు కొన్ని సీట్లు ఇద్దామని, తెలంగాణలో తీసుకుందామని టీడీపీ ముఖ్య నాయకులకు ఆయన స్పష్టం చేసినట్లుగా అందులో వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏదో ఒక జాతీయ పార్టీ అండ మనకు అవసరమని, అనుకూల మీడియా ద్వారా ప్రజలకు చెబుతామని, కాంగ్రెస్తో రాష్ట్రానికి మేలు జరుగుతుందని ప్రచారం చేద్దామని, లేకుంటే కేసులు, అవినీతి వ్యవహారాలతో ఇబ్బందుల్లో పడతామని చంద్రబాబు చెప్పినట్లుగా వచ్చింది.
అంతేకాదు, చంద్రబాబు వ్యాఖ్యలపై పలువురు టీడీపీ సీనియర్లు అభ్యంతరం తెలిపారని, అయినా ఆయన పొత్తుపై తేల్చేశారని పేర్కొన్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దల నుంచి సందేశం రావడంతో ఆయన పార్టీ నేతలతో అత్యవసరంగా భేటీ అయ్యారని రాసింది. ఇది టీడీపీ నేతల ఆగ్రహానికి గురైంది.
జగన్ వ్యాఖ్యలను ఉదహరిస్తూ.. తేల్చేసిన సాక్షి
టీడీపీ, కాంగ్రెస్ మధ్య పొత్తుకు వేగంగా అడుగులు పడుతున్నాయని, చంద్రబాబు తన పార్టీ నేతలకు స్పష్టత ఇచ్చేశారని, ఇప్పటికే వివిధ పార్టీలతో ఐదుసార్లు పొత్తు పెట్టుకున్న చంద్రబాబు, ఇప్పుడు ఆరో పెళ్లికి సిద్ధమవుతున్నారని ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిని ఉదహరిస్తూ.. జగన్ వ్యాఖ్యలకు బలం చేకూరుస్తూ కాంగ్రెస్ దోస్తీపై చంద్రబాబు తేల్చేశారని పేర్కొంది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోకుంటే ఇబ్బందుల్లో పడతామని పేర్కొన్నట్లు రాసింది.
కాంగ్రెస్తో పొత్తుపై ప్రజలకు ఏం చెప్పాలో నేను చెబుతా
బీజేపీతో విడిపోయినందున కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాల్సిన అవసరముందని, ప్రజలకు ఏం చెప్పాలో అది చెబుతామని కూడా చంద్రబాబు అన్నట్లుగా పేర్కొంది. ఇటీవల బీజేపీకి గ్రాఫ్ తగ్గి, కాంగ్రెస్ పార్టీకి పెరిగిందని బాబు అభిప్రాయపడ్డారని రాసింది. తెలంగాణతో కాంగ్రెస్తో పొత్తుపై త్వరలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారని పేర్కొంది.
అప్పుడే సీట్లపై చర్చ అంటూ
ఆ పార్టీ తీరు చుస్తుంటే చంద్రబాబు కాంగ్రెస్తో అంతర్గతంగా చర్చలు జరుపుతున్నట్లుగా కనిపిస్తోందని తెలుస్తోందని కూడా జగన్ మీడియా పేర్కొంది. సీట్ల సర్దుబాటుపై చర్చలు కూడా జరుగుతున్నాయని అభిప్రాయపడింది. సీట్ల విషయంలోను ఆ రెండు పార్టీల మధ్య దాదాపు క్లారిటీ వచ్చినట్లుగా పేర్కొంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి మనం 17 ఎమ్మెల్యే, 3 ఎంపీ సీట్లు తీసుకోవాలని, ఏపీలో కాంగ్రెస్ పార్టీకి 20 ఎమ్మెల్యే సీట్లు, 4 ఎంపీ సీట్లు ఇవ్వాలనే ప్రతిపాదనలపై ప్రాథమికంగా చర్చ జరిగిందని కూడా పేర్కొంది.
రాహుల్ వ్యాపారవేత్త భేటీలో బ్రాహ్మణి
ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఇటీవల హైదరాబాదులో పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. ఈ భేటీకి బ్రాహ్మణి హాజరు కావడాన్ని ప్రస్తావించింది. కుమారస్వామి ప్రమాణ స్వీకారం, కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు అంశాలు అంటూ పేర్కొంది. చంద్రబాబు గతంలో ఐదు పార్టీలతో పొత్తు పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ.. ఐదు పెళ్లిళ్లుగా పేర్కొంది. 1999, 2004, 2014లో బీజేపీతో, 2009లో తెరాసతో, 2009లో సీపీఎంతో, 2009లో సీపీఐతో, 2014లో జనసేనతో అంటూ పేర్కొంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఆరో పెళ్లి అంటూ పేర్కొంది. చంద్రబాబుపై, టీడీపీ - కాంగ్రెస్ పొత్తుపై జగన్ మీడియా ఇలా రాయడంపై టీడీపీ నేతలు ఆగ్రహోద్రులయ్యారు.