సీబీఐకి ఎంపీ అవినాశ్ రెడ్డి లేఖ - విచారణ వేళ..!!
విచారణ కు హాజరవుతున్న వేళ సీబీఐకీ ఎంపీ అవినాశ్ రెడ్డి లేఖ రాసారు.
సీబీఐ విచారణకు కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ఈ రోజు హాజరు కానున్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. తొలుత జారీ చేసిన నోటీసులకు సమాధానంగా తనకు అయిదు రోజుల సమయం కావాలని అవినాశ్ కోరుతూ లేఖ పంపారు. దీంతో, ఈ రోజున విచారణకు రావాలంటూ రెండో సారి సీబీఐ అధికారులు సమన్లు జారీ చేసారు. ఇప్పటికే వివేకా హత్య కేసులో సీబీఐ సుదీర్ఘ విచారణ చేస్తోంది. ఈ రోజు విచారణకు కావాల్సిన సమయంలో ఎంపీ అవినాశ్ రెడ్డి మరోసారి సీబీఐకి లేఖ రాసారు.
వివేకా హత్య కేసులో విచారణ కోసం ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ సీఆర్పీసీ 160 ప్రకారం నోటీసు జారీ చేసింది. ఈ నోటీసుల మేరకు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సీబీఐ ముందు అవినాశ్ హాజరు కానున్నారు. ఇదే సమయంలో అవినాశ్ సీబీఐకు లేఖ రాసారు. తాను విచారణకు హాజరు అవుతున్నట్లు వెల్లడించారు. తాను పూర్తిగా సహకరిస్తానని చెబుతూనే..విచారణ న్యాయబద్దంగా జరగాలని ఆకాంక్షించారు. తనతో పాటుగా న్యాయవాదిని విచారణకు అనుమతించాలని కోరారు. విచారణను వీడీయో తీసేందుకు అనుమతి ఇవ్వాలని లేఖలో కోరిన అవినాశ్ ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు.
వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన నిందితుడు దస్తగిరి ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా అవినాశ్ కు సీబీఐ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో తన పైన జరుగున్న ప్రచారం పై అవినాశ్ ఆవేదన వ్యక్తం చేసారు. కడప జిల్లా ప్రజలకు తానేంటో తెలుసని చెప్పుకొచ్చారు. ఇదే అంశం పైన ప్రభుత్వ సలహాదారు సజ్జల కీలక వ్యాఖ్యలు చేసారు. బీజేపీలో ఉన్న టీడీపీ స్లీపర్ సెల్స్ ఈ కేసు విషయంలో పని చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అవినాశ్ లేఖలో కోరిన విధంగా సీబీఐ అంగీకరిస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది.