మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు మృతి, నేతాజీ తరహా ట్విస్ట్!
విశాఖ: స్వాతంత్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మృతి కేసు పై ఇప్పటికీ ఎన్నో అనుమానాలు ఉన్నాయి. నేతాజీ మృతి పైన కేంద్రం అన్ని ఫైళ్లను బహిర్గతం చేయాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కొన్ని ఫైళ్లను బహిర్గతం చేసింది.
ఇదిలా ఉండగా, నేతాజీ వలె బ్రిటిష్పై పోరాడిన విశాఖ మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు మృతిలో కూడా ట్విస్ట్ ఉందా? అంటే కావొచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చరిత్రలో మనం చదువుకున్న విధంగా అల్లూరి సీతారామరాజు మృతి చెందకపోయి ఉంటారని అంటున్నారు.
బ్రిటిష్ వాళ్లు చంపింది... అల్లూరి సీతారామరాజు అనుచరుడు ఉప్పరపల్లి వీర వెంకట చారి కావొచ్చునని అంటున్నారు. ఈ నేపథ్యంలో డిఎన్ఏ పరీక్షల కోసం కూడా డిమాండ్ వినిపిస్తోందని అంటున్నారు.
అల్లూరి సీతారామ రాజు... స్వామీజీగా ఆ తర్వాత మారి ఉంటారని పలువురు స్థానికులు భావిస్తున్నారని తెలుస్తోంది. శ్రీ పరమహంస చిద్వెంకట రామ బ్రహ్మానంద మహర్షిగా ఆయన తూర్పు గోదావరి జిల్లాలోని బెండపూడిలో ఉండేవారని అంటున్నారు.
విశాఖలోని ప్రయివేటు కళాశాలలో చదువుతున్న నాగ సింహాద్రి అనే హ్యూమన్ జెనెటిక్స్ విద్యార్థి... అల్లూరి సీతారామరాజు గురించిన మిస్టరీని ప్రభుత్వం చేధించాలని కోరుతున్నారట. మరికొందరు... బెండపూడి సాధుగా అల్లూరి సీతారామరాజు ఎందుకు జీవించారో అర్థం కావడం లేదని అంటున్నారు.
చరిత్రలో మనం చదువుకున్న దాని ప్రకారం... తమ పైన పోరాడిన అల్లూరి సీతారామరాజు... బ్రిటిష్ వారు బంధించారు. చెట్టుకు కట్టేసి అతనిని చంపేశారు. అంతేకాదు, తమ పైన ఎవరు తిరుగుబాటు చేయకుండా ఉండేందుకు అతనిని చంపేసిన దాంతో గ్రామాల్లో ప్రదర్శించారు.
చరిత్ర ప్రకారం... అల్లూరి సీతారామరాజు 1924లో చనిపోయారు. 27 ఏళ్ల వయస్సులో చనిపోయారు. అయితే, బెండపూడి సాధువు అనుచరులు మాత్రం... అల్లూరి సీతారామరాజు 1968లో చనిపోయారని భావిస్తారని చెబుతున్నారు. బెండపూడి సాధువే అల్లూరి సీతారామరాజుగా భావిస్తున్నారట. అయితే, చరిత్రకారులు వీటిని కొట్టిపారేస్తున్నారు.