కాపు నేత ముద్రగడతో అంబటి రాంబాబు భేటీ: ఎందుకు?
కాకినాడ: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని తూర్పుగోదావరి జిల్లాలోని కిర్లంపూడిలోని ఆయన స్వగృహంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు భేటీ అయ్యారు. ఈ నెలాఖరున జిల్లాలో వైసిపి అధినేత వైయస్ జగన్ బహిరంగ సభ నిర్వహించ తలపెట్టడంతో ఈ భేటీకి ప్రాధాన్యం చేకూరింది.
అంబటి రాంబాబు ముద్రగడతో మంతనాలు జరపడం రాజకీయంగా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. చంద్రబాబు వ్యతిరేక శక్తుల ఏకీకరణపై వైయస్సార్ కాంగ్రెసు దృష్టి సారించిందని సమాచారం. ఇటీవలి కాలంలో కాపు నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తీవ్రంగా విమర్శిస్తున్నారు.
చంద్రబాబుపై ముద్రగడ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి ముద్రగడ పద్మనాభాన్ని ఆహ్వానించడానికి అంబటి రాంబాబు మంతనాలు జరుపుతున్నట్లు కూడా చెబుతున్నారు. ఇటీవలి ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం, బిజెపి కూటమికి మద్దతు పలకడంతో కాపుల ఓట్లు కూడా పడి ఆ కూటమి గెలిచిందని భావిస్తున్నారు.
ప్రస్తుత వాతావరణంలో పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండడం ఇతర కాపు నేతలు చంద్రబాబుపై పోరుకు సిద్ధం కావడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన మలుపునకు దారి తీస్తాయా అనే ఆలోచన సాగుతోంది. కాపు సామాజిక వర్గంలో ముద్రగడ పద్మనాభానికి మంచి పేరుంది. దీంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆయనను తమ వైపు లాక్కునే ప్రయత్నాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు.