అది చంద్రబాబు ఫ్యామిలీ సర్వే, కొత్తేమీ కాదు: అంబటి
హైదరాబాద్: సిఎంఎస్ సర్వే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సన్నిహితంగా ఉండే కుటుంబ సభ్యుల సర్వే అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు ప్రత్యామ్నాయం లేనది సర్వే ద్వారా చెప్పించారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
అలా చెప్పించుకోవడం చంద్రబాబుకు కొత్తేమీ కాదని ఆయన అన్నారు. 2004 ఎన్నికలకు ముందు చంద్రబాబుదే అధికారమని సిఎంఎస్ నివేదిక ఇచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీన్ని బట్టి ఈ సర్వే విశ్వసనీయత ఏమిటో అర్థం చేసుకోవచ్చునని అంబటి రాంబాబు అన్నారు.
బాబు, జగన్లకు సర్వే షాక్: కెసిఆర్కు ఆంధ్ర మార్కులు
చంద్రబాబు నాయుడికి ప్రజాదరమ ఉంటే తమ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన శాసనసభ్యులతో రాజీనామాలు చేయించి ఎందుకు ఎన్నికలకు వెళ్లడం లేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే పార్టీ మారిన శాసనసభ్యులతో రాజీినామాలు చేయించి తిరిగి గెలిపించుకోవాలని ఆయన సవాల్ చేశారు.
ఈ నెల 19వ తేదీన జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతను లోటస్ పాండులో అన్ని జిల్లాలో పార్టీ అధ్యక్షులు, ఇంచార్జీలతో సమావేశం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు, రైతాంగ సమస్యలు, మంచినీటి ఎద్దడి వంటి ప్రధాన సమస్యలపై సమావేశంలో చర్చిస్తామని చెప్పారు. ఈ సమావేశం తర్వాత తమ పార్టీ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు.