పండుగలపై అమలాపురం ఎంపీ వివాదాస్పద వ్యాఖ్య, ఉంగరం.. ఇక పెట్టుకొనని శపథం
కాకినాడ: అమలాపురం పార్లమెంటు సభ్యులు రవీంద్ర బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యల పైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు పవిత్రంగా వినాయక నవరాత్రులను జరుపుతారని, నిమజ్జనం రోజున విగ్రహాలను కాలువల్లోకి తోసేస్తారని, అవశేషాలను అపవిత్రంగా వదిలేస్తారన్నారు.
కాకినాడలో జరిగిన వైద్యా వైజ్ఞానిక సాంకేతిక ప్రదర్శనలో ఆయన ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందూ పండుగల పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మతం పేరిట బాబాలు, మాతాజీలు అనేక మోసాలకు పాల్పడుతున్నారన్నారు.
వాళ్ల దగ్గరకు వెళ్లి చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారని, మహిళలు తమ కేరెక్టర్ను పోగొట్టుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీపావళి నాడు బాణసంచా కాల్చడం వల్ల ఖర్చుతో పాటు కాలుష్యం పెరుగుతోందన్నారు.
హోలీ పండుగ రోజున అతిగా రంగలు పూసుకోవడంతో అనారోగ్య పరిస్థితులు తలెత్తుతాయన్నారు. ప్రాంతీయ, కుల, మతతత్వాల కారణంగా సాంకేతిక పరిజ్ఞానం చెందాల్సినంత అభివృద్ధి చెందలేద్నారు. ఉపగ్రహాలను పంపించే సమయంలో తిరుమలకు వెళ్లడం ఏమిటని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా విలేకరులు.. మీ చేతి ఉంగరానికి పెట్టుకున్న రాయి ఏమిటి అని అడిగారు. దీంతో, ఆయన అప్పటికప్పుడే దానిని తీసి బల్ల పైన పెట్టారు. అందంగా ఉందని, పెట్టుకోవాలని భార్య చెబితే పెట్టుకున్నానని, ఈ రోజు నుంచి తాను దానిని పెట్టుకోనని చెప్పారు.
హిందువుల పండుగల పైన ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర దుమారం చెలరేగింది. దీంతో ఆయన ఒకింత తగ్గారు. సైన్స్ను పూజించవద్దని, ఆచారాలను పక్కన పెట్టి సైన్స్ పైన దృష్టి సారిస్తే దేశం గుర్రాలం పరిగెడుతుందని అబ్దుల్ కలాం చెప్పారని, తాను కూడా భారతీయుడినే అని, ఏ మతాన్ని కించపరిచే ఉద్దేశ్యం తనకు లేదని అన్నారు.