జగన్ కు తలనొప్పిగా మారిన ఆమంచి తీరు .. చీరాల వైసీపీ శ్రేణుల్లోనూ అసంతృప్తి
ఏపీలో ఎన్నికల్లో వైసిపి ప్రభంజనం కొనసాగింది. కానీ ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గంలో మాత్రం ఆమంచి కృష్ణ మోహన్ ఘోర ఓటమి పాలయ్యారు. ప్రకాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఆమంచి కృష్ణమోహన్ ఎన్నికలకు ముందు నుంచి వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసిపిలోకి పార్టీ ఫిరాయించిన ఆమంచి చీరాలలో టిడిపి సీనియర్ నేత కరణం బలరాంపై 17 వేల ఓట్ల భారీ మెజారిటీతో పరాజయం పొందారు. ఓటమి పాలైనా ఆయనలో ఏ మాత్రం మార్పు రాలేదు .
నందికొట్కూరు వైసీపీలో వర్గ పోరు .. దాడులు , కేసులు .. జగన్ వద్దకు చేరిన పంచాయితీ
వైసీపీ చీరాల నేత ఆమంచిపై ఆరోపణలు
రాష్ట్రమంతా వైసీపీ సత్తా చాటినా చీరాలలో ఓటమికి మాత్రం ఆమంచి వ్యక్తిగత ప్రవర్తనే కారణమని పలువురు విమర్శించారు. తాను ఓటమి పాలైనా ఆమంచి మాత్రం పార్టీ అధికారంలోకి రావటంతో తన పెత్తనం సాగాలని చూస్తున్నారు. ఓటమి పాలైనా కూడా ఆమంచి కుటుంబం ఎన్నికలు ముగిసినప్పటినుంచి స్థానికంగా ఉన్న ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుండటంతో పలువురు ఆయన విషయంలో రోడ్డెక్కారు. భయబ్రాంతులకు గురి చేస్తున్నాడు అంటూ ఫిర్యాదులు చేశారు .
వరుస వివాదాల్లో ఆమంచి
గతంలో ఆమంచి అన్న కుమారుడు ఆమంచి రాజేంద్ర హోంగార్డు బండబూతులు తిడుతూ ఉన్న ఆడియో క్లిప్ వైరల్ అయింది.రాజేంద్ర నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ హోంగార్డ్ రవికుమార్ రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. స్థానికంగా ఇది చర్చనీయాంశంగా మారింది. ఇక ఓ మాజీ ఎంపీటీసీ ఆమంచి అనుచరుల నుంచి తన ఆస్తులకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరుతూ కలెక్టరేట్ ముందు ఆత్మహత్యాయత్నం చేయడం కూడా కలకలం రేపింది. ఇక వైసీపీ ఆవిర్భావం నుంచి వైసీపీలో ఉన్నానని జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశానని, ఆ పార్టీ ఎంపీటీసీగా కూడా ఉన్నానని చెప్పిన వెంకటేశ్వర్లు ఆమంచి తీరుతో ఆత్మహత్య యత్నం చేశారు అంటే ఆమంచి తీరు అర్ధం చేసుకోవచ్చు .
సొంత పార్టీ నేతలతోనూ ఆమంచి పంచాయితీ
అటు ఎన్నికల్లో గెలవక, ఇటు స్థానికంగా ఉన్న వైసిపి నేతలతోనే పొసగక, రోజుకు ఒక వివాదాన్ని కొనితెచ్చుకుంటున్న ఆమంచి కృష్ణమోహన్ వ్యవహారశైలిపై వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చర్య తీసుకోకుంటే ప్రకాశం జిల్లాలో పార్టీ పరిస్థితి దారుణంగా తయారవుతుందని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఆమంచి తీరు అటు టీడీపీ నేతలకే కాదు , సొంత పార్టీ నేతలకు కూడా నచ్చటం లేదు. తన ఓటమికి వైసీపీ నేతలు సహకరించకపోవటమే కారణం అని భావించి టార్గెట్ చేసి మరీ వారిని వేధింపులకు గురి చేస్తున్నారు ఆమంచి .దీంతో ఆయన వ్యవహార శైలిపై పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
జగన్ కు పెద్ద తలనొప్పిగా ఆమంచి వ్యవహారం
ఎన్నికల్లో ఓడినా కూడా తమ పార్టీ అధికారంలో ఉండడంతో తన రాజకీయాన్ని మళ్ళీ చూపిస్తూ టీడీపీ నేతలపై అక్రమకేసులు పెట్టిస్తున్నారని అటు టీడీపీ నేతలు వాపోతున్నారు. ఇటీవల నాగార్జున రెడ్డిపై తన అనుచరులతో దాడి చేయించడం వంటి ఘటనలపై కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆమంచిపై జగన్ కాస్త సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని , లేకుంటే అది పార్టీకి చీరాలలో భారీ నష్టం చేస్తుందని వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు. ఆమంచి తీరుతో పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.