షరతుల్లేవు, పవన్ కళ్యాణ్ పిలవలేదు: జగన్తో ఆమంచి భేటీ, కుటుంబంతో సహా..
హైదరాబాద్/అమరావతి: ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బుధవారం నాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన వైసీపీ అధినేతను కలిశారు. ఒంగోలులో నిర్వహించనున్న వైసీపీ సమరశంఖారావం సభలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. అంతకుముందు ఆయన తన రాజీనామా లేఖను తెలుగుదేశం పార్టీకి పంపించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జగన్ను కలిశారు. భేటీ అనంతరం ఆమంచి మీడియాతో మాట్లాడారు.
అందుకే రాజీనామా చేశా
తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని, ఆ పార్టీ నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆమంచి స్పష్టం చేశారు. చీరాల నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యకలాపాల్లో బయటి శక్తుల ప్రమేయం ఉందని చెప్పారు. తాను పార్టీ మారడానికి కేవలం తన నియోజకవర్గం సమస్యలే కారణం కాదని చెప్పారు. కానీ హిందువులు ఎంతో పవిత్రంగా భావించే పసుపు-కుంకుమను రాజకీయం చేశారని మండిపడ్డారు. డ్వాక్రా మహిళలు ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పారు. ఇలాంటి అంశాలను నిరసిస్తూ రాజీనామా చేశానని చెప్పారు.
హైదరాబాదులో పదేళ్ల పాటు ఉండకుండా వచ్చేశారు
తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఎలాంటి షరతులు పెట్టలేదని ఆమంచి చెప్పారు. జగన్ కూడా ఎలాంటి హామీలు ఇవ్వలేదని చెప్పారు. సమాజం గురించి మాట్లాడే వారిని ముఖ్యమంత్రి వద్ద ఉన్న వ్యక్తులు కలవనీయడం లేదని చెప్పారు. విభజన చట్టం ప్రకారం మనకు (ఏపీ వారికి) పది సంవత్సరాలు హైదరాబాదులో ఉండే హక్కు ఉందని, కానీ ఏడాది రెండేళ్లలోనే ఎందుకు వచ్చారని ప్రశ్నించారు.
వారే కలుస్తున్నారు
చంద్రబాబుతోను గతంలో భేటీ అయ్యానని, ఓ ముఖ్యమంత్రి హోదాలో ఆయనతో జరిగిన చర్చ సంతృప్తికరమేనని, కానీ కేడర్ పైనే ఆమంచి అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతకుముందు మూడేళ్లకు పైగా టీడీపీలో ఉన్నానని చెప్పారు. కానీ తన అనుచరుల సూచన మేరకు, రాష్ట్ర భవిష్యత్తు కోసం తాను టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నానని చెప్పారు. సమాజానికి అతీతమైన శక్తులే తెల్లారి లేస్తే చంద్రబాబును కలుస్తున్నారని చెప్పారు. తమలాంటి ప్రజాప్రతినిధులకు కలిసే అవకాశం దొరకడం లేదని చెప్పారు.
నా ప్రత్యర్థి ఎవరో నాకు సంబంధం లేదు
నేను గత మూడేళ్ల పాటు ప్రజలతో ఉన్నానా లేదా అనే విషయం ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్ చదివితే తెలుస్తుందని ఆమంచి చెప్పారు. తాను సామాన్య కుటుంబం నుంచి ప్రజాప్రతినిధి స్థాయికి వచ్చానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తనకు ప్రత్యర్థిగా ఎవరు ఉంటారనే విషయం తనకు సంబంధం లేదని చెప్పారు. తాను మాత్రం వైసీపీ నుంచి పోటీ చేస్తానని అన్నారు.
జనసేనలో చేరుతానని చెప్పలేదు, పిలవలేదు
తాను జనసేన పార్టీలో చేరుతానని ఎప్పుడూ చెప్పలేదని ఆమంచి అన్నారు. రాష్ట్రం గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో తాను పలుమార్లు చర్చలు జరిపానని, అంతేకానీ ఆయన తనను పార్టీలోకి ఆహ్వానించలేదని, అలాగే తాను వెళ్తానని చెప్పలేదని అన్నారు. తాను గత ఎన్నికల్లో ఇండిపెండెంట్గా గెలిచానని, కాబట్టి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని చెప్పారు.