ఆ శక్తుల వల్లే, 10 రోజులుగా వైసీపీతో చర్చలు: అసలు విషయం చెప్పిన ఆమంచి!
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్, జనసేనల వైపు చూస్తున్న ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తాను చంద్రబాబుకు అన్ని విషయాలను చెప్పానని అన్నారు. తాను లేవనెత్తిన అంశాలను ముఖ్యమంత్రి సానుకూలంగా విన్నారన్నారు.
టీడీపీతో ఘర్షణ పడి దగ్గరయ్యా
కానీ తన సహచరులు, అనుచరులతో భేటీ అనంతరం తాను నిర్ణయం తీసుకుంటానని ఆమంచి చెప్పారు. తాను ఒక్కడినే నిర్ణయం తీసుకోలేనని చెప్పారు. ఓ నాయకుడిగా అందరి అభిప్రాయాలు తీసుకొని ఆ తర్వాత స్పందిస్తానని చెప్పారు. తాను గతంలో కూడా తెలుగుదేశం పార్టీతో ఘర్షణ పడ్డానని, ఆ తర్వాత ఆ పార్టీకి దగ్గరయ్యానని చెప్పారు. టీడీపీతో ఉండాలన్నదే తన అభిమతమని, కానీ మా వారితో చర్చించకుండా ఏమీ చెప్పలేనని అన్నారు.
వైసీపీతో చర్చలు జరుపుతున్నా
గత పది రోజులుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సంప్రదింపులు జరుగుతోన్న మాట వాస్తవమేనని ఆమంచి చెప్పారు. అలాగే, బుధవారం తోట త్రిమూర్తులుతో భేటీలో తాను రాజకీయ, కులపరమైన అంసాలపై చర్చలు జరిపానని చెప్పారు. ఆయన సలహాలు తీసుకున్నానని అన్నారు. చంద్రబాబుతో చర్చల అనంతరం తాను సంతృప్తి చెందానని చెప్పారు. కానీ అనుచరులతో చర్చించాక తన తుది నిర్ణయం ఉంటుందన్నారు.
అలా బాధపెట్టారు!
చీరాలలో తనకు వ్యతిరేకంగా కొన్ని శక్తులు పని చేశాయని ఆమంచి చెప్పారు. తాను ప్రస్తుతం కులాల గురించి మాట్లాడనని, కానీ కొన్ని శక్తులు మాత్రం తనకు చీరాలలో అడ్డంకులు సృష్టించాయన్నారు. చీరాలలో మంత్రి నారా లోకేష్ పర్యటనను వివాదాలు సృష్టించి ఆపేశారన్నారు. లోకేష్ వస్తున్నారని ప్రకటన ఇచ్చాక రాకుండా అడ్డుకున్నారని వాపోయారు. ఎందుకు రాలేదని తాను అధిష్టానాన్ని అడిగితే సంతృప్తికర సమాధానం రాలేదని చెప్పారు. వివాదాలు సృష్టించే శక్తులు పార్టీలో ఉన్నాయని చెప్పారు. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా కార్యక్రమాలు రద్దు చేస్తున్నారన్నారు. పార్టీ ఇక్కడ ఉందా, ఇతర దేశాల్లో ఉందా అన్నారు. తనకు ఎవరూ శత్రువులు లేరని, సమస్యలే తన శత్రువు అన్నారు.