గల్లా వారి అమర రాజా భూములపై మరో ట్విస్ట్- తెరపైకి కొత్త వాదన- ప్రభుత్వ అధికారాలపై ప్రశ్న..
గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన అమర రాజా ఇన్ ఫ్రా సంస్ధకు గతంలో చిత్తూరు జిల్లాకు కేటాయించిన భూముల్లో కొంత భాగాన్ని వెనక్కి తీసుకుంటూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ భూములు వెనక్కి తీసుకోవడంపై అమర రాజా సంస్ధ హైకోర్టును ఆశ్రయించింది. వాదనల సందర్భంగా అమర రాజా సంస్ధ చేసిన వాదనల్లో ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రభుత్వ అధికారాలను ప్రశ్నిస్తూ అమర రాజా సంస్ధ చేసిన వాదనను హైకోర్టు అంగీకరిస్తే భవిష్యత్తులో ప్రభుత్వాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లవుతుంది.
టీడీపీ ఎంపీ గల్లా కుటుంబానికి జగన్ సర్కార్ షాక్- అమర్ రాజా ఇన్ ప్రా భూములు వెనక్కి...
అమర రాజా భూముల కథ...
2009లో అప్పటి రోశయ్య ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి గల్లా అరుణకుమార్ కుటుంబానికి చెందిన అమర్ రాజా ఇన్ ఫ్రా సంస్ధకు 483.27 ఎకరాల భూమిని డిజిటల్ వరల్డ్ సిటీ నిర్మాణానికి కేటాయించారు. పదేళ్లు పూర్తవుతున్నా కాంట్రాక్టు నిబందనల ప్రకారం ఉద్యోగాలు కల్పించకపోవడంతో ఈ భూమిలో 253.61 ఎకరాలను వెనక్కి తీసుకుంటున్నట్లు తాజాగా ఏపీ పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగాల కల్పన లేకపోవడంతో పాటు సంస్ధ విస్తరణ కూడా చేపట్టకపోవడంతో ఈ భూములు వెనక్కి తీసుక్కోవాలని ఏపీఐఐసీకి జారీ చేసిన ఆదేశాల్లో పరిశ్రమల శాఖ పేర్కొంది.
హైకోర్టుకు సవాల్ చేసిన అమర రాజా...
గతంలో తమకు కేటాయించిన భూములను ఏపీఐఐసీ వెనక్కి తీసుకునేలా ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై అమర రాజా సంస్ధ హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం దురుద్దేశంతో జారీ చేసిన ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని హైకోర్టును సంస్ధ తరఫు న్యాయవాది అభ్యర్ధించారు. ఆ భూములను ప్రభుత్వం ఏపీఐఐసీకి విక్రయించిందని, ఏపీఐఐసీ తమకు విక్రయించిందని, ఇప్పుడు వెనక్కి తీసుకోమని ప్రభుత్వం ఎలా ఆదేశాలు ఇస్తుందని అమర రాజా వాదనల సందర్భంగా ప్రశ్నించింది. కాబట్టి ఇందుకోసం జారీ చేసిన జీవో 33 ను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరింది
Recommended Video
ప్రభుత్వ అధికారాలపై ప్రశ్న...
అయితే ఈ కేసులో అమర రాజా న్యాయవాది చేసిన వాదనలో ప్రభుత్వ అధికారాలను ప్రశ్నించడం ఓ కొత్త ట్విస్ట్ ఇచ్చింది. తమ భూములను ఏపీఐఐసీ వెనక్కి తీసుకోమని కోరే అధికారం ప్రభుత్వానికి లేదంటూ అమర రాజా న్యాయవాది వాదించారు. ప్రభుత్వం నేరుగా తమకు భూములు అమ్మలేదని, అప్పుడు వెనక్కి ఎలా తీసుకుంటుందని ప్రశ్నించారు. ఇప్పటికే అక్కడ రూ.2700 కోట్లు పెట్టి అభివృద్ధి పనులు చేశామని, ఒప్పందంలో చెప్పిన దాని కంటే ఎక్కువ ఉద్యోగాలు కల్పించామని హైకోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన అడ్వకేట్ జనరల్ శ్రీరామ్.. సెజ్ ఏర్పాటు చేస్తామన్న హామీ నెరవేర్చలేదన్నారు. ఒప్పంద నిబంధనలు ఉల్లంఘించినప్పుడు భూములు వెనక్కి తీసుకోమని కోరే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. దీంతో మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయాన్ని కూడా న్యాయమూర్తి వాయిదా వేశారు.