మీ బాధేంటి? సీఎం స్థాయికి ఆ మాత్రం 'ఇల్లు' ఉండొద్దా?: అమరనాథ్ రెడ్డి
కూలీ పనిచేసేవారు కూడా ఇల్లు కట్టుకుంటారని, ఎవరి స్థోమత ప్రకారం వారు ఇల్లు కట్టుకుంటారని అమరనాథ్ రెడ్డి అన్నారు. అలాంటప్పుడు ఒక సీఎం స్థాయి వ్యక్తి ఆయన స్థాయికి తగ్గట్లు ఇల్లు కట్టుకోవడంలో తప్పేంటని ప్
చిత్తూరు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి కొత్త ఇంటి వ్యవహారంపై దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. కొత్త ఇంటి విషయంలో ఇంత గోప్యత ఎందుకు పాటిస్తున్నారని, కోట్లు ఖర్చు పెట్టి ఇంటిని నిర్మించారని వైసీపీ ఆరోపిస్తోంది. దీంతో టీడీపీ నుంచి కూడా వైసీపీకి కౌంటర్ మొదలైంది.
రహస్యంగా ఎందుకు?, బాబు 'భూతల స్వర్గం' ఇంటిపై ఇంత గోప్యతా?: భూమన
తాజాగా పలమనేరు టీడీపీ ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి వైసీపీపై విమర్శలు గుప్పించారు. ఉద్యోగులందరిని ఏపీకి తరలించి చంద్రబాబు హైదరాబాద్ లో ఇల్లు కట్టుకోవడమేంటి? అన్న ప్రతిపక్షాల వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. హైదరాబాద్ లో ఇల్లు కట్టుకుంటే మీకొచ్చిన బాధేంటి అని ప్రశ్నించారు.
కూలీ పనిచేసేవారు కూడా ఇల్లు కట్టుకుంటారని, ఎవరి స్థోమత ప్రకారం వారు ఇల్లు కట్టుకుంటారని అమరనాథ్ రెడ్డి అన్నారు. అలాంటప్పుడు ఒక సీఎం స్థాయి వ్యక్తి ఆయన స్థాయికి తగ్గట్లు ఇల్లు కట్టుకోవడంలో తప్పేంటని ప్రశ్నించారు.
1988లోనే అప్పటి సీఎం ఎన్టీఆర్ చంద్రబాబుకు జూబ్లీహిల్ల్స్ లో ఇల్లు ఇచ్చారని, దాని స్థానంలోనే ఆయన కొత్త ఇంటిని నిర్మించుకున్నారని అన్నారు. చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నవాళ్లంతా ఎక్కడెక్కడ ఇళ్లు కట్టుకున్నారో జనమందరికీ తెలుసున్నారు.
ఇక విద్యా ఉపాధి విషయంలో పార్టీపై వస్తున్న విమర్శలను అమరనాథ్ రెడ్డి తప్పుపట్టారు. కొంతమంది టీడీపీ నాయకులు సైతం ఈ విమర్శలు చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తరువాత 125 పెద్ద, మధ్య తరగతి పరిశ్రమలను ప్రారంభించడం ద్వారా 50వేల మందికి ఉపాధి కల్పించామన్నారు.
చిత్తూరు జిల్లాలోని సత్యవేడు, ఏర్పేడు తదితర ప్రాంతాల్లో ప్రారంభించిన పరిశ్రమల ద్వారా ఇప్పటికీ 17,099మందికి ఉపాధి అవకాశాలు కల్పించినట్లు చెప్పారు. మూడేళ్ల పాలనలోనే ఇన్ని పెట్టుబడులు సాధించిన ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమన్నారు. గతంలో కేవలం గుజరాత్ రాష్ట్రానికి మాత్రమే పరిశ్రమలు వచ్చేవని, ఇప్పుడు ఏపీలో పరిశ్రమలు పెట్టడానికి కూడా ప్రముఖులు ఆసక్తి చూపుతున్నారని అన్నారు.
పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురావాలంటే వాటికి భూములు, నీటివసతి వంటివి ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, భూనిర్వాసితులకు ఏ రాష్ట్రంలో ఇవ్వనంత నష్టపరిహారం ఏపీ ప్రభుత్వం ఇస్తోందని అన్నారు. ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు.