అసెంబ్లీ సమావేశాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి, విఐపీల భద్రత కోసం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నవంబర్ 10 నుంచి ప్రారంభం కానున్న దృష్ట్యా ప్రభుత్వం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నవంబర్ 10 తేదీ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ శీతాకాల సమావేశాలు 10 రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. దీంతో ఇప్పటికే వివిధ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అసెంబ్లీ సమావేశాల కోసం తరలివస్తున్నారు.
ఈ నేపధ్యంలో బుధవారం డీజీపీతో సహా ఉన్నతాధికారులు సచివాలయంలో సమావేశం కానున్నారు.మరోవైపు అమరావతి భౌగోళికంగా గుంటూరు జిల్లా పరిధిలో ఉన్నందున గుంటూరు రూరల్, అర్బన్ ఎస్.పి.ల పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి వచ్చే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారుల వాహనాలు మంగళగిరి, తాడికొండ మీదుగా అసెంబ్లీకి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. విజయవాడ వైపు నుంచి వచ్చే వాహనాలను ప్రకాశం బ్యారేజీ, కనకదుర్గమ్మ వారధి మీదుగా ఉండవల్లి నుంచి వెలగపూడి పంపే ఏర్పాట్లు చేశారు.
విఐపి ల భధ్రత దృష్ట్యా దారి పొడవునా అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మంగళగిరి వైపు నుంచి వచ్చే వాహనాలు కృష్ణాయపాలెంలో కొత్తగా నిర్మించిన రోడ్డు ద్వారా అసెంబ్లీకి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎర్రబాలెం డాన్బాస్కో వద్ద, కృష్ణాయపాలెంలో ,మరికొన్ని ప్రదేశాల్లో పోలీసు చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉండవల్లిలోని తన నివాసం నుంచి వెంకటపాలెం,మందడం మీదుగా అసెంబ్లీకి వెళ్లే ఏర్పాటు చేశారు.
విఐపిల భధ్రత కోసం పోలీసు, ఇంటెలిజెన్స్, స్పెషల్బ్రాంచి, బాంబుస్క్వాడ్, డాగ్స్క్వాడ్, ఇతర నిఘా సంస్థల ఉన్నతాధికారులు ఇలా సుమారు 5వేల మంది సిబ్బంది మంగళగిరి తరలివస్తున్నారు. వీరికోసం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పోలీసు 6వ బెటాలియన్ ఆవరణలో, ఆచార్యనాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో బస కల్పిస్తున్నారు.
తొలుత నవంబర్ 8 వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరపాలని భావించినా ఆ రోజు మంచిది కాదనే పండితుల సూచన దృష్ట్యా తేదీని 10 కి మార్చినట్లు తెలిసింది. ఈ సమావేశాల్లోనే బాలికా సంరక్షణ, బాలికల సమస్యలకు సంబంధించిన అంశాలపై ప్రత్యేకంగా ఒకరోజు ఎమ్మెల్యేలకు అవగాహనా కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు.
మరోవైపు వైసిపి గైర్హాజరు నేపధ్యంలో తలెత్తే పరిణామాల దృష్ట్యా ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అసెంబ్లీ శీతాకాల సమావేశాల నేపధ్యంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు సోమవారం అసెంబ్లీలోని తన ఛాంబర్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పదిరోజుల పాటు సమావేశాలు జరిపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది.