నేడు అమరావతి బంద్ .. జేఏసీ నేత సుధాకర్ పై దాడికి నిరసన
రాజధాని అమరావతి గ్రామాల్లో నేడు బంద్ నిర్వహిస్తున్నారు. రాజధాని అమరావతి గ్రామాల్లో రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ఆందోళనలు కొనసాగుతుండగానే పేదలకు భూములు ఇవ్వాలని ప్రభుత్వం సర్వే చేపట్టటం ఉద్రిక్తతలకు దారి తీసింది.ఇక డ్రోన్ కెమెరాలతో రాజధాని గ్రామాల్లో విజువల్స్ చిత్రీకరిస్తున్న నేపధ్యంలో జేఏసీ నేత సుధాకర్ పై పోలీసులు దాడి చేసిన సంఘటన నేపధ్యంలో నేడు రాజధాని అమరావతి గ్రామాల్లో బంద్ కొనసాగుతుంది.
రాజధాని గ్రామాల్లో డ్రోన్ కెమెరాలు .. మందడం, కృష్ణాయ పాలెంలో ఉద్రిక్తత
జేఏసీ నేత సుధాకర్ పై పోలీసుల దాడికి నిరసనగా బంద్
అమరావతిలో రైతులు సడన్గా నేడు అమరావతి బంద్కు పిలుపునిచ్చారు. అమరావతిలోని 29 గ్రామాల పరిధిలో బంద్ పాటించాలని నిర్ణయించారు.జేఏసీ నేత సుధాకర్ పై పోలీసుల దాడికి నిరసనగా రాజధాని గ్రామాల్లో బంద్ కొనసాగుతుంది . విద్య,వ్యాపార సంస్థలు బంద్కు సహకరించాలని అమరావతి జేఏసీ కోరింది. మొన్న మందడంలో పోలీసులు డ్రోన్ కెమెరాలతో విజువల్స్ తీస్తున్న క్రమంలో రైతు ఐకాస నేత సుధాకర్పై పోలీసులు దాడి చేయడాన్ని ఖండిస్తూ బంద్కు పిలుపునిచ్చినట్లు జేఏసీ నేతలు తెలిపారు.
రైతులు,మహిళలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని జేఏసీ నేతల డిమాండ్
అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న క్రమంలో నేడు 66వ రోజు కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కృష్ణాయపాలెం, మందడం ఘటనల్లో రైతులు,మహిళలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రైతులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అసలే రాజధాని విషయంలో తమకు న్యాయం జరగలేదు అని రైతులు ఆవేదనలో ఉన్నారు.
మహిళలు స్నానాలు చేస్తుండగా డ్రోన్ కెమెరాలతో వీడియోలు తీశారని రైతుల ఆరోపణ
అసలే ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో ఆందోళనలో ఉన్న రైతులు అదే అమరావతిలో నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నవారి ఇళ్లపై నుంచి కొందరు పోలీసులు డ్రోన్ కెమెరాలు వినియోగించడం పెద్ద దుమారానికి దారి తీస్తోంది. మహిళలు స్నానాలు చేస్తుంటే డ్రోన్ కెమెరాలతో షూట్ చేస్తున్నారని రాజధాని గ్రామాల్లో మహిళా రైతులు ఆరోపిస్తున్నారు. అయితే, ఆ ఆరోపణలను పోలీసులు ఖండిస్తూ కావాలనే రైతులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు.
Recommended Video
పోలీసులు వర్సెస్ రైతులు అన్నట్టు అమరావతి ఆందోళన
ఏది ఏమైనా రాజధాని అమరావతి గ్రామాల్లో ఆందోళనలు మిన్ను ముడుతున్నాయి. రాజధాని రగడ కాస్త పోలీసులు వర్సెస్ రైతులు అన్న చందంగా తయారైంది. అమరావతి నుంచి రాజధానిని తరలించేందుకు ఒప్పుకోబోమని ఇప్పటికే రైతులు తేల్చి చెప్పారు.ఇక తమ ప్రాణాలు అయినా ఇవ్వటానికి సిద్ధం అన్న రైతులు రాజధాని అమరావతి తరలింపు ఒప్పుకోమని రైతులు నేటికీ దీక్షలను కొనసాగిస్తున్నారు. ఇక ఈ క్రమంలో తాజా పరిణామాలు రాజధాని గ్రామాల్లో ఉద్రిక్తతలకు కారణం అవుతున్నాయి. ఇక నేడు కొనసాగుతున్న బంద్ నేపధ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు.