ఈ నెల 27న అమరావతి బాండ్ల లిస్టింగ్...వేడుకగా ప్రక్రియ
అమరావతి:ఎపి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ది కార్యక్రమాల కోసం ప్రవేశపెట్టిన అమరావతి బాండ్ల లిస్టింగ్ ప్రక్రియ ఈ నెల 27 న జరగనుంది. అమరావతి బాండ్లకు పెట్టుదారుల నుంచి అనూహ్య స్పందన లభించిన నేపథ్యంలో లిస్టింగ్ ప్రక్రియను వేడుకలా నిర్వహించేందుకు ఏపీసీఆర్డీయే సన్నాహాలు చేస్తోంది.
ఈ బాండ్లు స్టాక్ ఎక్స్ఛేంజ్లో అధికారికంగా ట్రేడింగ్లోకి రావడంతోపాటు...వీటిని కొనుగోలు చేసిన సంస్థలు...తిరిగి విక్రయించుకొనే వీలు కల్పించడాన్నే లిస్టింగ్ అంటారు. బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్(బిఎస్ఈ)లో సోమవారం జరిగే అమరావతి బాండ్ల లిస్టింగ్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గోనున్నారు. ఆర్బీఐ సహా పేరొందిన వివిధ మ్యూచువల్ ఫండ్ కంపెనీలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల ప్రతినిధులతోపాటు పెట్టుబడిదారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలిసింది.
ఈమేరకు కొద్ది రోజులుగా సిఆర్డీఏ వారందరికీ ఆహ్వానాలు పంపించడంతో పాటు ఈ కార్యక్రమం కోసం అమరావతి నుంచి ముంబై వెళ్లే వారికి అవసరమైన సౌకర్యాల కల్పనలో నిమగ్నమై ఉంది. దేశంలోని అన్ని స్థానిక సంస్థలూ కలిపి ఇన్నేళ్లుగా బాండ్ల విక్రయం ద్వారా సమకూరిన మొత్తం కంటే అధిక మెుత్తంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క అమరావతి బాండ్ల విక్రయం ద్వారా ఆర్జించిన సంగతి తెలిసిందే.
Recommended Video
సిఆర్డీఏ రూ.1,300 కోట్ల విలువైన అమరావతి బాండ్లను జారీ చేసిన గంటలోనే అనూహ్య స్పందన లభించి ఆ మొత్తానికి ఒకటిన్నర రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయ్యి వీటి ద్వారా రూ.2,000 కోట్ల సొమ్ము సమకూరడం రాష్ట్ర ప్రభుత్వానికి సంతోషాన్నిచ్చింది. ఈ పరిణామం ద్వారా జాతీయ మదుపరుల్లో సీఎం చంద్రబాబు పట్ల ఎంత నమ్మకం ఉన్నదీ నిర్ధారణ అయిందని టిడిపి నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో స్టాక్ మార్కెట్ ద్వారా రాజధాని అభివృద్ది కోసం కోసం మరిన్ని నిధులు సమకూర్చుకునేందుకు వీలుగా ఎపి ప్రభుత్వం అంతర్జాతీయ ఇన్వెస్టర్ల కోసం ప్రత్యేక బాండ్లను విడుదల చేయాలని యోచిస్తోంది. మరికొద్ది నెలల్లోనే లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో మసాలా బాండ్లు, అనంతర కాలంలో పెట్టుదారుల కోసమే కాకుండా సాధారణ ప్రజలు అమరావతి నిర్మాణంలో భాగస్వాములయ్యేలా రూ.100 ముఖ విలువ కలిగిన బాండ్లను జారీ చేయాలని సీఆర్డీయే భావిస్తోంది. అందుకే ఈ నెల 27 న జరగనున్న అమరావతి బాండ్ల లిస్టింగ్ ప్రక్రియను అత్యంత ఘనంగా నిర్వహించాలని ఎపి ప్రభుత్వం నిర్ణయించింది.