అమరావతి అందరి కోసం...డిసెంబర్ కల్లా సివిల్ కోర్టు భవనం పూర్తి:మంత్రి నారాయణ
అమరావతి: అమరావతి కార్పొరేట్ రాజధాని కాదని...ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు నివసించేందుకు వీలుగా నిర్మాణాలు చేపడుతున్నామని రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ చెప్పారు.
రాజధాని అమరావతిలో పర్యటన సందర్భంగా భవనాల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. మొత్తం 1450 ఎకరాల్లో పరిపాలన నగరం, న్యాయ నగరం పనులు జరుగుతున్నాయని...డిసెంబర్ చివరి కల్లా సివిల్ కోర్టు భవనం పూర్తి చేస్తామని మంత్రి నారాయణ ఈ సందర్భంగా తెలిపారు. కేంద్రం సహాయం చేయకపోయినా కష్టపడి ముందుకెళ్తున్నామని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు.
ఇదిలావుండగా నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న జుడీషియల్ సముదాయం పనులను ఏపీ సీఆర్డీఏ కమిషనర్ డా.చెరుకూరి శ్రీధర్ మంగళవారం రాత్రి పరిశీలించారు. నిర్మాణానికి సంబంధించి ఆయన అధికారులు, గుత్తేదారులతో సమీక్షించారు. ఎట్టి పరిస్థితిల్లోనూ డిసెంబరు 15లోగా జుడీషియల్ సుముదాయం పనులన్నీ పూర్తిచేయాలని కమిషనర్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.
అనంతరం ఎన్జీవో అధికారుల నివాస భవనాల నిర్మాణ పనులను కూడా సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ పరిశీలించారు. రాఫ్ట్ ఫౌండేషన్కు ముందుగా వేస్తున్న ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్ పనులను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. అనంతరం ఐఏఎస్ అధికారుల నివాసాలకు సంబంధించిన పనులను పరిశీలించారు. ఈ క్రమంలో అంతర్గత ఫినిషింగ్కు సంబంధించిన సూచనలు చేశారు.
భవనాల నిర్మాణాలను పరిశీలించేందుకు వెళ్లిన ఏపీ సీఆర్డీఏ కమిషనర్ డా.చెరుకూరి శ్రీధర్ తో పాటు సిఆర్డీఏ సీఈ ఎం.జక్రయ్య, ఎస్ఈ సీహెచ్ ధనుంజయ తదితరులు ఉన్నారు.