అమరావతి కదలదు .. జనసేన నిద్రపోదు .. మీ మీద పడిన దెబ్బలు వైసీపీ వినాశనానికే : పవన్ భావోద్వేగం
రాజధాని అమరావతినే శాశ్వత రాజధాని అని పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంత ప్రజలకు భరోసా ఇచ్చారు . మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో పెట్టి ఆమోదం పొందిన నేపధ్యంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పవన్ కళ్యాణ్ నేడు రాజధానిప్రాంత రైతులతో భేటీ అయ్యారు. బీజేపీతో కలిసింది కేవలం అమరావతి శాశ్వత రాజధాని కోసం అని ఆయన స్పష్టం చేశారు. మనసులో ఉన్న బాధను తొక్కిపెట్టి మరీ ఈ రోజు రాజధాని కోసం పోరాడుతున్న రైతులకు బాసటగా ఉంటానని ఆయన పేర్కొన్నారు.
రాజధాని ప్రాంత ప్రజల ఒంటి మీద పడిన దెబ్బ వైసీపీ సర్వనాశనానికి నాంది
రాజధాని ప్రాంత ప్రజల ఒంటి మీద పడిన దెబ్బ వైసీపీ సర్వనాశనానికి కారణం అవుతుందని పవన్ పేర్కొన్నారు. రాజదాని ప్రాంతంలో ఆడ, మగ తేడా లేకుండా , వృద్ధులు అని జాలి కూడా లేకుండా చేసిన పాపం వైసీపీ వినాశనానికి కారణం అని పేర్కొన్నారు. మేకులున్న లాఠీలతో కొట్టటం పోలీసులా రౌడీలా అన్న భావన కలుగుతుందని పేర్కొన్నారు. ఆడపడుచులతో కన్నీరు పెట్టించిన జగన్ ప్రభుత్వం నాశనం అవుతుందని ఆయన పేర్కొన్నారు. రేపు ఢిల్లీ వెళ్లి ఢిల్లీ బీజేపీ పెద్దలతో రాజధాని అమరావతి గురించి మాట్లాడి వస్తానని పేర్కొన్నారు.
ప్రజా కంటకులు ఎవరైనా సర్వనాశనం అవుతారని వైసీపీపై ఫైర్
అమరావతి ఇక్కడ నుండి కదలదు అని రాజధాని ప్రాంత రైతులకు మాటిచ్చారు. ప్రస్తుత పాలకులకు ప్రజల మీద ప్రేమ లేదని, ప్రజలంతా ప్రస్తుత ప్రభుత్వానికి పావులే అని పవన్ పేర్కొన్నారు. సెక్రటేరియట్ ఉద్యోగులు సైతం ఆందోళనలకు దిగాలని పవన్ కోరారు. వారికి జనసేన అండగా ఉంటుందని చెప్పారు.రాజధాని ప్రాంత ప్రజల కన్నీరు ఆనంద భాష్పాలు అయ్యేంతవరకు జనసేన అండగా ఉంటుందని పవన్ పేర్కొన్నారు. ప్రజా కంటకులు ఎవరైనా సర్వనాశనం చెందుతారని పవన్ వ్యాఖ్యానించారు. కూల్చివేతలతో మొదలైన వైసీపీ ప్రభుత్వం కూల్చివేతలతోనే పోతుందని పవన్ ఘాటుగా విమర్శించారు.
బీజేపీతో కలిసిందే అమరావతి కోసం అన్న పవన్
జనసేన , బీజేపీలు అమరావతి రాజధానిగా ఉండటం కోసం పోరాటం చేస్తామని మాటిస్తున్నా అని ఆయన పేర్కొన్నారు. బీజేపీతో కలిసి సాగేది అందుకే అన్నారు. అప్పట్లో టీడీపీ 33 వేల ఎకరాల భూసేకరణకు విరుద్ధంగా నాడు మాట్లాడానన్న పవన్, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ చేసిన వారిపై కేసులు పెట్టమని చెప్పినా అవన్నీ పక్కన పెట్టి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ త్యాగాలను తాను మర్చిపోలేనని చెప్పిన పవన్ మీ బిడ్డల భవిష్యత్ కోసం అండగా ఉంటానని చెప్పారు పవన్ .
అమరావతి ఇక్కడ నుండి కదలదని మాటిచ్చిన పవన్
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతినేనని ఆయన పేర్కొన్నారు. తనను తిట్టే ప్రతి ఒక్కరిని హెచ్చరించిన పవన్ మీరు తిట్టిన ప్రతిదానికి కచ్చితంగా సమాధానం చెప్తామని చెప్పారు. మీ భూమి మిమ్మల్ని మోసం చెయ్యదని, అమరావతినే రాజధాని అని పదేపదే ఆయన రాజధాని రైతులకు నొక్కి చెప్పారు. చాలా భావోద్వేగంతో మాట్లాడిన ఆయన మీ కన్నీళ్లకు సమాధానం కోసం పోరాటం చేస్తానన్నారు. మీ మీద పడిన దెబ్బలు ,గొంతులేని మూగ వారిపై పడిన దెబ్బలు తన గుండెలకు బలంగా తాకాయని ,తాను ఆ బాధ మర్చిపోలేనని చెప్పారు.
అహంకారంతో మదమెక్కి కొట్టుకుంటున్నారని విమర్శ
జగన్ రెడ్డి కావాలంటే మూడు రాజధానులు కాదు ముప్పై రాజధానులు పెట్టుకున్నా తిరిగి ఒకే రాజధాని చేసి తీరతామని చెప్పారు. వైసీపీ నాయకులు అహంకారంతో మదమెక్కి కొట్టుకుంటున్నారని ఘాటుగా విమర్శించారు. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా అమరావతినే శాశ్వత రాజధాని అని చెప్పిన పవన్ వచ్చే ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా వైసీపీని గెలిపించకుండా బుద్ధి చెప్పాలని అన్నారు. దేశ భవిష్యత్ , రాష్ట్ర సమగ్రత కావాలని కోరుకుంటున్నానని చెప్పిన ఆయన తనకు డ్రామాలు చెయ్యటం రాదనీ , ప్రతిరోజూ అందరికీ కనిపించకపోవచ్చు కానీ ఫలితం కోసం ప్రయత్నం చేస్తానని పవన్ పేర్కొన్నారు. అవకాశవాద రాజకీయం తమకు రాదని, మార్పు కోసమే పోరాటం చేస్తామని చెప్పారు పవన్ .