మూడు రాజధానులు, మండలి రద్దుపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు: ‘భూదందా కోసమే విశాఖ’
న్యూఢిల్లీ: మూడు రాజధానుల విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కారు పునరాలోచించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూచించారు. అమరావతి రైతులు, రాజధాని పరిరక్షణ జేఏసీ నేతలు ఆదివారం ఢిల్లీలో కిషన్ రెడ్డిని కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రాజధాని మార్పు నిర్ణయం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వివరించారు.
మంచిది కాదు..
అంతేగాక, శాంతియుతంగా నిరసనలు చేస్తున్న రైతులు, ప్రజలపై ఏపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని రైతులు కిషన్ రెడ్డిని కోరారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి వికేంద్రీకరణ మంచిదే అయినా.. రాజధాని మార్పు మంచిది కాదని అన్నారు. ఏపీ బీజేపీ మూడు రాజధానులు వద్దని చెప్పిందని తెలిపారు.
జగన్ సర్కారు నుంచి అధికారిక సమాచారం లేదు
మూడు రాజధానులపై ఇప్పటి వరకు జగన్ సర్కారు నుంచి అధికారికంగా కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. కేంద్రానికి లిఖితపూర్వకంగా సమాచారం అందిన తర్వాతే ఏపీ ప్రభుత్వంతో మాట్లాడతామని చెప్పారు. ప్రధాని, కేంద్ర పెద్దలు, బీజేపీ పెద్దలతో ఏపీ రాజధాని విషయంలో మాట్లాడతానని తెలిపారు.
రైతుల గురించి ఆలోచించాలి
రాజ్యాంగ పరిధిలోనే కేంద్రం వ్యవహరిస్తోందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏ విషయమైనా.. కొన్ని సూచనలు చేస్తామని, రైతుల గురించి కూడా ఆలోచించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. మూడు రాజధానుల విషయం గానీ, శాసనమండలి రద్దుపై గానీ కేంద్రానికి అధికారికంగా సమాచారం అందలేదని తెలిపారు.
భూ దందా కోసమే విశాఖ.: కన్నా
ఇది ఇలావుండగా, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. విశాఖపట్నంలో భూదందా చేసేందుకే అమరావతి నుంచి రాజధానిని మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని జగన్ సర్కారుపై మండిపడ్డారు. సీఎం జగన్ తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రాన్ని బూచిగా చూపిస్తున్నారని విమర్శించారు.
జగన్ కక్షపూరితంగానే..
రాజధాని అంశంపై తాము మొదటి నుంచి ఒకటే వైఖరితో ఉన్నామని.. పరిపాలన అంతా అమరావతి నుంచే జరగాలని కోరుతున్నామని కన్నా స్పష్టం చేశారు.
అభివృద్ధిని పక్కనపెట్టి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని జగన్పై లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. విశాఖలో 6వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడ పెట్టాలో కేంద్రం నిర్ణయించదని తెలిపారు.