అమరావతిలో ప్రపంచంలోనే ఎత్తయిన సచివాలయం...దేశంలో తొలి డయాగ్రిడ్ భవనం కూడా ఇదే:సిఎం చంద్రబాబు
అమరావతి:ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సచివాలయ భవనాన్ని ఆంధ్రప్రదేశ్లో నిర్మించి చరిత్ర సృష్టించబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. అంతేకాదు ఇది దేశంలోనే తొలి డయాగ్రిడ్ భవనమని కూడా సిఎం చంద్రబాబు వెల్లడించారు.
సిఎం చంద్రబాబు ఈ విషయాలు వెల్లడించినట్లు ఏపీ ఇంధన, మౌలిక వసతుల శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సచివాలయానికి ఇంకా మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయని సిఎం వివరించినట్లు ఆ ప్రకటనలో వెల్లడించారు. ఆదివారం ఈ సచివాలయం నిర్మాణం విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్డీయే, ఏడీసీ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ సందర్భంగా సిఎం చంద్రబాబు సమీక్ష వివరాలు ఏపీ ఇంధన, మౌలిక వసతుల శాఖ ప్రకటన ద్వారా తెలిపింది.
ప్రపంచంలోనే...ఎత్తైన సచివాలయం
అమరావతిలో నూతనంగా నిర్మించే సెక్రటేరియట్ భవనం రూ.4890 కోట్ల బడ్జెట్ తో 41 ఎకరాల్లో 212 మీటర్ల ఎత్తుతో నిర్మితం కానుంది. ఇది ప్రపంచంలోనే ఎత్తయినది. అంతేకాదు దేశంలోనే తొలి డయాగ్రిడ్ భవనం, అలాగే ఇందులో ట్విన్ లిఫ్ట్ సౌకర్యాన్ని కూడా ప్రవేశపెడుతున్నామని స్వయంగా సిఎం చంద్రబాబే అధికారులకు వివరించారు. సీఆర్డీయే, ఏడీసీ అధికారులతో నూతన సచివాలయం నిర్మాణం విషయమై సమీక్షించిన సిఎం చంద్రబాబు ఈ నిర్మాణం గురించి అధికారులకు దిశానిర్ధేశం చేశారు.
అమరావతి...ప్రత్యేకతలు
ఈ సచివాలయం నిర్మాణానికి అత్యున్నత ప్రమాణాలు పాటించనున్నాం...సామాజిక మౌలిక వసతుల కల్పనలోనూ ఇవే ప్రమాణాలను పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారట. "అనేక ఇబ్బందులు, కష్టాల మధ్య మూడేళ్ల కిందట ప్రయాణాన్ని ప్రారంభించాం. ప్రపంచంలోనే ఐదు అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దాలని నిర్ణయించాం. అతితక్కువ సమయంలోనే తాత్కాలిక పరిపాలనా భవనం, అసెంబ్లీని నిర్మించుకొని చరిత్ర సృష్టించాం" అన్నారు చంద్రబాబు.
ప్రపంచం...గుర్తించింది
వచ్చే ఏడాది కల్లా అమరావతి ప్రభుత్వ భవన సముదాయ నిర్మాణం కూడా ఒక రూపునకు వస్తుందని సిఎం చంద్రబాబు తెలిపారు. తమ కష్టాన్ని, నిబద్ధతను, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు గుర్తించారని...కొత్త రాష్ట్రమైనప్పటికీ పెట్టుబడులకు అమరావతిని ఎంచుకొంటున్నారని సిఎం చెప్పుకొచ్చారు. తమ సర్కార్పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న నమ్మకానికి ఇదే నిదర్శనమన్నారు.
శరవేగంగా...నిర్మాణ పనులు
శాశ్వత సచివాలయం, శాసనసభ, హైకోర్టు భవనాల నిర్మాణ పనులు పూర్తయ్యే గడువులను తెలియజేస్తూ సమగ్ర నివేదిక సమర్పించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అనంతరం సీఆర్డీయే సీఈవో అజయ్జైన్ మాట్లాడుతూ రూ.14,360 కోట్లతో చేపట్టిన రోడ్లు, నీటి సరఫరా, మురుగునీటి పారుదల, రూ.4890 కోట్లతో మొదలుపెట్టిన సచివాలయం, హైకోర్టు భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని వివరించారు. కీలక పెట్టుబడి అవకాశాలను కూడా సీఆర్డీయే గుర్తించిందని అన్నారు.