అమరావతిలో పెయిడ్ ఆర్టిస్ట్ ఉద్యమం.. ఉత్తరాంధ్ర తిరగబడితే అసలు సిసలు ఉద్యమం : తమ్మినేని సీతారాం
ఏపీ రాజధానిపై అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు బస్సు యాత్రకు సిద్దమవగా.. ఆస్తులను కాపాడుకునేందుకే చంద్రబాబు ఉద్యమం అంటున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. తాజాగా ఆ స్పీకర్ తమ్మినేని సీతారాం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. అమరావతిలో జరుగుతున్నది సహజసిద్దమైన పోరాటం కాదని, అసలు సిసలు ప్రజా ఉద్యమం ఎలా ఉంటుందో తాము చేసి చూపిస్తామని అన్నారు.
అమరావతిలో లాగా తమది పెయిడ్ ఆర్టిస్ట్ ఉద్యమం కాదని, విశాఖలో రాజధానిని ప్రతిపాదనను వ్యతిరేకిస్తే ఉద్యమం అంటే ఏంటో చూపిస్తామని స్పీకర్ తమ్మినేని పేర్కొన్నారు శ్రీకాకుళం నుండి రాయలసీమ వరకు తాము చేయబోయే ఉద్యమం ఎలా ఉంటుందో చంద్రబాబుకు చూపిస్తామన్నారు.
అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్, ఆస్తులను కాపాడుకునేందుకే చంద్రబాబు జనాలను ప్రభుత్వం పైకి ఉసిగొల్పుతున్నారని స్పీకర్ తమ్మినేని ఆరోపించారు. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు పార్టీ స్టాండ్ అంటూ అమరావతిలోనే రాజధాని ఏర్పాటు చేయాలనడం సిగ్గుచేటన్నారు. ఏళ్లుగా ఉత్తరాంధ్ర ప్రజలు వెనుకబాటుతననాకి గురవుతుంటే కళ్లు కనిపించలేదా అని ప్రశ్నించారు.
రాజకీయం చేసుకుని బతికే మీదీ ఓ బతుకేనా అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఓ ఉత్తరాంధ్ర పౌరుడిగా విశాఖలో రాజధాని ఏర్పాటుకు ఎంతవరకైనా పోరాడుతామని చెప్పారు.ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ప్రతిపక్షాలకు ధీటైన జవాబు చెబుతామన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినైనా అరెస్ట్ చేస్తారని, గతంలో ఏ కారణం లేకుండానే సీఎం జగన్ను విశాఖ ఎయిర్పోర్టులో అరెస్ట్ చేశారని గుర్తుచేశారు.
ఇదిలా ఉంటే, అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నేటి నుంచి బస్సు యాత్రకు సిద్దమయ్యారు.పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి తాడేపల్లి గూడెం, తణుకు మీదుగా రాజమండ్రి వరకు నేడు బస్సు యాత్ర సాగనుంది. ఆ తర్వాత కోటిపల్లిలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. అయితే ఆయన సభకు అనుమతులు లేవని పోలీసులు చెబుతున్నారు. దీంతో మరోసారి అక్కడ ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది.