రేపు చిరంజీవి ఇంటిని ముట్టడించబోతున్నారా.. జేఏసీ కన్వీనర్ ఏమంటున్నారు..
ఈ నెల 29న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇంటిని అమరావతి పరిరక్షణ సమితి ముట్టడించబోతోందన్న ప్రచారంపై జేఏసీ కన్వీనర్ గద్దె తిరుపతిరావు స్పందించారు. సోషల్ మీడియాలో జేఏసీ పేరుతో తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు. చిరంజీవి ఇంటి ముట్టడికి తాము పిలుపునివ్వలేదని స్పష్టం చేశారు. అటువంటి ప్రచారాలను నమ్మవద్దని.. అమరావతి ఉద్యమాన్ని నీరుగార్చేందుకే కొంతమంది కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
కాగా, ఈ నెల 29న ఉదయం 10గంటలకు హైదాబాద్ జూబ్లీహిల్స్లోని చిరంజీవి ఇంటిని అమరావతి పరిరక్షణ సమితి ముట్టడించబోతున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆరోజు సాయంత్రం 5గంటల వరకు చిరంజీవి ఇంటి ముందు జేఏసీ దీక్ష చేపట్టబోతోందని అమరావతి పరిరక్షణ యువజన జేఏసీ పేరిట ఓ స్టేట్మెంట్ వైరల్గా మారింది. అయితే తాజాగా దీనిపై స్పందించిన అమరావతి పరిరక్షణ సమితి ఆ ప్రచారంలో నిజం లేదని తేల్చి చెప్పింది. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలన్న డిమాండుతో పోరాటం జరుగుతుందని స్పష్టం చేసింది.
కాగా,సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయానికి మెగాస్టార్ చిరంజీవి మద్దతు పలికిన సంగతి తెలిసిందే. ఓవైపు ఆయన సోదరుడు,జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని ఉద్యమిస్తుంటే.. చిరంజీవి జగన్కు మద్దతు పలకడం చర్చనీయాంశమైంది. అదే సమయంలో వైసీపీ తరుపున చిరంజీవిని రాజ్యసభకు పంపిస్తున్నారన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమరావతి పరిరక్షణ సమితి చిరంజీవి తీరును తప్పుపడుతూ ఆయన ఇంటి ముట్టడికి సిద్దమవుతోందన్న ప్రచారం జరిగింది. తాజాగా జేఏసీ క్లారిటీ ఇవ్వడంతో ఆ ప్రచారానికి తెరపడింది.