గవర్నర్ ను కలిసిన అమరావతి జేఏసీ నేతలు .. ఏం చెప్పారంటే
ఆంధ్రప్రదేశ్ లో రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రాజధాని రైతుల పోరాటం నేటితో 31వ రోజుకు చేరుకుంది . ఒక పక్క రాజధాని రైతుల పోరాటం ఉధృతంగా సాగుతుంటే, మరో పక్క ప్రభుత్వం తమ పని తాము చేసుకుపోతుంది. ఇక రాజధాని రైతుల పోరాటాన్ని అడుగడుగునా అడ్డుకోవటం కోసం పోలీసులు విఫల యత్నం చేస్తున్నారు. మహిళలు అని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇక ఈ నేపధ్యంలో తాజా పరిణామాలను గవర్నర్ బిస్వభూషణ్ హరి చందన్ దృష్టికి తీసుకు వెళ్ళటానికి నిర్ణయం తీసుకున్న జేఏసి నేతలు నేడు గవర్నర్ ను కలిశారు.
రాజధాని ప్రాంతంలో రాజధాని అమరావతి తరలింపుకు నిరసనగా నెలకొన్న పరిస్థితులను వివరించడం కోసం అమరావతి జేఏసీ నేతలు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ను కలిశారు. రాజధాని ప్రాంతంలో పోలీసులు శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న తమపై నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని, రైతులపై దాడులకు తెగబడ్డారని వారు గవర్నర్కు తెలిపినట్లు సమాచారం. మహిళల పట్ల పోలీసుల వైఖరిని సైతం వారు గవర్నర్ కు తెలిపారు.
గవర్నర్ను కలిసి బయటకు వచ్చిన అమరావతి జేఏసీ నేతలు విలేకరులతో మాట్లాడుతూ ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో అరాచకం కొనసాగుతుందని, రాజధాని రైతుల, ప్రజల బాధలను గవర్నర్కు వివరించామని చెప్పారు. పోలీసుల నిరంకుశ ప్రవర్తనను కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. అమరావతిలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని కొనసాగేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ కోరినట్లు జేఏసీ నేతలు తెలియజేశారు. దీనిపై గవర్నర్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు అమరావతి జేఏసీ నేతలు .