చంద్రబాబు-పరిటాల సునీత, లోకేష్..: అసెంబ్లీలో అమరావతి భూముల చిట్టా విప్పిన మంత్రి బుగ్గన
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్ గత తెలుగుదేశం ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అమరావతి రాజధాని ఎందుకు వచ్చిందో తెలిస్తే బాధగా ఉందని అన్నారు. రాజధాని ప్రకటనకు ముందే టీడీపీ నేతలంతా అక్కడ భూములు కొన్నారని అన్నారు. ఇందుకు సంబంధించిన లెక్క కూడా చెప్పారు.
అసెంబ్లీలో వికేంద్రీకరణ బిల్లు: మూడు రాజధానులపై మంత్రి బుగ్గన కీలక ప్రకటన
చిట్టా పెద్దది.. మంచినీళ్లు తాగి చెబుతా..
2018-2019 వరకు 65వేల కోట్లు లోటు బడ్జెట్ ఉందని.. ప్రస్తుతం రూ. 1.40లక్ష కోట్లు లోటు ఉందని చెప్పారు మంత్రి బుగ్గన. అమరావతి ప్లాన్ ఎందుకు వచ్చిందంటే.. అని చెప్పిన మంత్రి బుగ్గన.. ఇది చాలా పెద్దదని మంచినీళ్లు తాగుతానని అన్నారు. మీరు నీళ్లు తాగితే పర్లేదు.. మమ్మల్ని నీళ్లు తాగించకండి అని స్పీకర్ సరదాగా అన్నారు. ఆ తర్వాత మంత్రి బుగ్గన మళ్లీ ప్రసంగాన్ని కొనసాగించారు. రాజదాని ప్రాంతంలో టీడీపీ నేతలే భూములు కొన్నారని తెలిపారు.
Recommended Video
స్కెచ్ వేశారిలా..
2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రాజధాని కోసం భారీ స్కెచ్ వేశారన్నారు. స్టెప్ 1 అని ఏం చేశారంటే.. మొదట గుంటూరు.. ఆ తర్వాత నూజివీడు అని ప్రకటించారు. అక్కడ అందరూ దృష్టిసారిస్తే రాజధాని అమరావతి ప్రాంతంలో మాత్రం కొంత మంది భూములు సేకరించారు. వారిలో టీడీపీ నేతలు ఉండటం గమనార్హమని అన్నారు.
చంద్రబాబుతో మొదలు..
2014 జూన్ నుంచి డిసెంబర్ 31 వరకు టీడీపీ నేతలు భూములు కొన్నారు. ఆ తర్వాతే అమరావతిని రాజధానిగా అప్పటి టీడీపీ సర్కారు ప్రకటించింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4070 ఎకరాల భూములు వారు కొన్నట్లు తేలిందని, ఇంకా ఎంతుందో అని చెప్పారు. ఈ భూములు కొన్నవారిలో మొదటి వ్యక్తి అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అని చెప్పారు. ఇది ఇన్ సైడర్ ట్రేడింగ్ తోపాటు అప్పటి సీఎం ఓత్ ఆఫ్ సీక్రసీని ఉల్లంఘించారని అన్నారు. తాడికొండ మండలం కంటేరు గ్రామంలో చంద్రబాబు నాయుడు 14.24 ఎకరాలు కొన్నారు. హేరిటేజ్ ఫుడ్స్ పేరిట కొనుగోలు. జులై, ఆగస్టులలో 2014లో కొన్నారు. డిసెంబర్ 31న రాజధానిగా నోటిఫై చేశారు. ఇంతకుముందే భూమి కొనుగోలు చేశారు. ఇది ఏం జరిగిందని ప్రశ్నించారు మంత్రి బుగ్గన.
పరిటాల సునీత.. లంకదినకరణ్..
లంక దినకరణ్ అనే వ్యక్తి టీడీపీలో ముఖ్యమైన వ్యక్తి. ఆయన తూళ్లూరులో కొన్నారు. వేమూరి రవికుమార్ ప్రసాద్.. సెవెన్ హిల్స్ లాజిస్టిక్స్ పేరు మీద భూములు కొన్నారు. 2014 నవంబర్లో కొన్నారు. మాజీ మంత్రి పరిటాల సునీత కూడా భూములు కొన్నారు. వీఆర్ ఇన్ ఫ్రా పేరు మీద కొన్నారు. కొడుకు, అల్లుడు ఈ కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్నారు. 2014 ఆగస్టు-నవంబర్లో కొన్నారు. జీవీఎస్ ఆంజనేయులు, ఆయన కుటుంబసభ్యులు కూడా భారీ ఎత్తున భూములు కొన్నారు. వీరంతా 40 ఎకరాలు కొన్నారు. ఇదంతా 40వేల కోట్ల స్కాం చేసినట్లే అవుతుందని మంత్రి అన్నారు.
చంద్రబాబు బినామీలు.. పయ్యావుల సహా టీడీపీ నేతలు
లింగమనేని రమేష్ .. చంద్రబాబు ఉండే ఇల్లు ఆయనదే. జులై 2014లోనే 80 ఎకరాలు భూములు కొన్నారు. ఆర్థికి పరిస్థితి బాలేనప్పుడు ఎవరి పేరున బినామీగా కొంటారు అంటే వైసీపీ సభ్యులు చంద్రబాబు అని చెప్పుకొచ్చారు. పయ్యావుల కేశవ్ కూడా భూములు కొన్నారు. విక్రమ సింహా పేరు మీద భూములు కొన్నారు. ధూళిపాళ్ల నరేంద్ర కూడా భూములు కొన్నారు. నంబూరు, పెదకాకాని, మంగళగిరిలో భూములు కొన్నారు. కంభంపాటి రామ్మోహన్ కూతురు స్వాతి కూడా భూములు కొన్నారు. పుట్ట మహేశ్ యాదవ్.. పుట్టా సుధాకర్ యాదవ్.. తాడికొండలో భూములు కొన్నారు. వీరంతా 2014 డిసెంబర్ లోపే భూములు కొన్నారని మంత్రి బుగ్గన తెలిపారు.
నారాయణ.. నారా లోకేష్ బినామీలు..
నారాయణ బినామీ పేర్ల మీద ఉన్న భూములు కొన్నారు. కొమ్మలపాటి శ్రీధర్ కూడా నల్లపాడు, పొత్తూరు, పిచ్చికలపాలెంలో భూములు కొన్నారు. వేమూరి రవికుమార్ ప్రసాద్, వేమూరి రవిప్రసాద్.. ఎవరిని అడిగినా.. వీరంతా నారా లోకేష్ బినామీలేనని చెబుతారు. రిజిస్ట్రేషన్ ఆఫీసులో కూడా ఇదే చెబుతున్నారు. దీనిపై సందేహం లేదని మంత్రి అన్నారు. 100ల ఎకరాలున్నాయి. కోడెల శివప్రసాద్ 17 ఎకరాలున్నాయి. అనంతరంపురంలో ఉండే పల్లె రఘునాథ రెడ్డి మందడంలో భూములు కొన్నారు. మురళీమోహన్ కుటుంబసభ్యుల పేర్ల మీద భూములు కొన్నారు. జీవీ ఆంజనేయులు, బుచ్చయ్యచౌదరి కూడా భూములు కొన్నారు.
చంద్రబాబు ప్లాన్ మామూలుగా లేదుగా..
టీడీపీ సభ్యులు ఆందోళన చేయడంతో బినామీలపై విచారణ జరుగుతుందని మంత్రి చెప్పారు. సింగపూర్ కంపెనీకి ఇచ్చిన తర్వాత బౌండరీలు మార్చారని మంత్రి చెప్పారు. 2016లో 2017 కిలోమీటర్లకు తగ్గించారు. ల్యాండ్ పూలింగ్కు ఇవ్వలేదన్నారు. రింగ్ రోడ్డు కూడా వారు కొన్న భూముల పక్కనుంచే పోవాలి. హెరిటేజ్ పక్కనే ఉంది. రాజధాని ప్రాంతంలోని పలు గ్రామాల్లో లేని ప్రభుత్వ భూములు, లంక భూములు, ప్రభుత్వ పోరంబోకు భూములని చెప్పి ఫ్లాట్లు తీసుకున్నారు. వినూత్నమైన స్కీముల్లో ఇదంతా చేశారని మంత్రి చెప్పారు. అసైన్డ్ భూములు, అబ్జెక్డన్డ్ భూములను కూడా వదిలిపెట్టలేదని మంత్రి బుగ్గన అన్నారు.
సుజనా చౌదరి... మళ్లీ బాబు, లోకేష్ బినామీలే..
సుజనా చౌదరి బినామీ ప్రాపర్టీ, ఏజీగా ఉన్న దమ్మలపాటి శ్రీనివాస్ డైరెక్టుగా భూములు కొన్నారు. ఇంత స్కాం చేసి అమరావతి ఇక్కడ ఉండాలంటున్నారు టీడీపీ నేతలు. వ్యాపార లక్ష్యంగా పెట్టుకుని ఇదంతా చేశారు. ఎస్సీలను బెదిరించి వారి భూములను కొని.. వారిని మోసం చేశారు. మొత్తం 300 ఎకరాలు.. కొళ్లి శివరాం, గుమ్మడి సురేష్ వీరిద్దరు కూడా లోకేష్ బినామీలు. మరికొందరు కలిసి ఈ భూములను కొనుగోలు చేశారు. 28వేల మంది రైతులు 34వేల ఎకరాలు ఇచ్చారు. 14వేల మంది రైతులు అమ్ముకున్నారు. ఫ్లాట్లిస్తే 8వేల కార్యకాపాలు జరిగాయి. ఇది రాజధానా? రియల్ ఎస్టేట్ వ్యాపారం అనాలా? అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిలదీశారు. యూనివర్సిటీలకు, ప్రైవేటు సంస్థలకు కూడా ఇష్టారాజ్యంగా భూములు కేటాయించారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఎక్కువ రేట్లకు భూములు, వీరికి కావాల్సిన వారికి వందల ఎకరాలను తక్కువ రేట్లకే కట్టబెట్టారని స్పష్టం చేశారు.