రాజధానిలో ఉద్రిక్తత: చంద్రబాబు సహా నేతల అరెస్ట్, విడుదల, అసలేం జరిగింది.?
అమరావతి: బుధవారం రాత్రి అమరావతి పరిరక్షణ సమితి కేంద్ర కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వేదిక కళ్యాణ మండపం వద్ద కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పలువురు టీడీపీ నేతలు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణపాటో పలువురు జేఏసీ నేతలు బస్సు యాత్రను ప్రారంభించేందుకు పాదయాత్రగా బయల్దేరారు. అయితే, వారిని పోలీసులు అక్కడే అడ్డుకున్నారు.
మాట మార్చే సీఎం! జగన్ దరిద్రమైన ఆలోచన అదే: జనసేన తీవ్ర విమర్శలు
ఎందుకీ దౌర్జన్యం..
కాసేపు చంద్రబాబు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. చంద్రబాబును కదలనివ్వకపోవడంతో బెంజిసర్కిల్ వద్ద రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతి జేఏసీ నేతల బస్సు యాత్రకు అనుమతివ్వాలని డిమాండ్ చేశారు. తాము చట్ట ప్రకారమే నడచుకుంటున్నామని, ఎందుకిలా దౌర్జన్యం చేస్తున్నారని పోలీసులను నిలదీశారు చంద్రబాబు.
చంద్రబాబు తీవ్ర ఆగ్రహం..
ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చేసుకోండని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. శాంతియుతంగా తాము నిరసన తెలుపుతున్నామని, ఏ చట్టం ప్రకారం తమను అడ్డుకుంటున్నో చెప్పాలని చంద్రబాబు పోలీసు అధికారులను నిలదీశారు. భారీ ఎత్తున ప్రజల చేరుకుంటుండటంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆందోళన తీవ్రతరం అవుంతుండటంతో చంద్రబాబు సహా నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నేతలు, ప్రజలు నినాదాలు చేశారు.
చంద్రబాబు సహా నేతల అరెస్ట్..
చంద్రబాబు తోపాటు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ, ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు, ఎమ్మెల్సీ అశోక్ బాబులను పోలీసులు వాహనంలోకి ఎక్కించి అక్కడ్నుంచి తరలించారు. తొలుత ఆ వాహనం తాళం చెవి దొరక్కపోవడంతో వేరే వాహనం సాయంతో తీసుకెళ్లారు. కాగా, మీడియా ప్రతినిధులను పోలీసులను తోసివేయడంతో పలువురికి గాయాలయ్యాయి.
చంద్రబాబు నివాసం వద్ద..
చంద్రబాబు, నారా లోకేష్, ఇతర టీడీపీ నేతలను వాహనంలో తరలించిన పోలీసులు.. కాసేపటి తర్వాత వారిని ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద విడిచిపెట్టారు. సమాచారం అందడంతో అక్కడికి భారీగా టీడీపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. తదుపరి కార్యాచరణపై చంద్రబాబు సహా నేతలు చర్చించారు.
రాష్ట్రంలోనూ తిరగనివ్వరా?
కాగా, పోలీసుల తీరుపై పలువురు టీడీపీ నేతలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సు యాత్రకు అనుమతిస్తే సహకరిస్తామని చెప్పినా పోలీసులు వినలేదని.. ఆ ఐదు బస్సులపై తామేమైనా పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, ఇరాక్కు వెళ్తున్నామా? అని ప్రశ్నించారు టీడీపీ నేత నిమ్మల రామానాయుడు. తమకు రాష్ట్రంలో తిరిగే హక్కు లేదా? అని నిలదీశారు. ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడూ రాష్ట్రంలో చూడలేదని సీనియర్ నేత అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ సర్కారు ప్రజాగ్రహానికి గురికాక తప్పదని అన్నారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, రాజధానిగా అమరావతి ఉండేవరకు పోరాటం చేస్తామని సీపీఐ నేత రామకృష్ణ స్పష్టం చేశారు.