చంద్రబాబు సహా నేతల అరెస్ట్: పవన్ కళ్యాణ్ తీవ్ర స్పందన, జగన్ సర్కారుకు వార్నింగ్
అమరావతి: రాజధాని అమరావతి రైతులకు మద్దతుగా నిరసన తెలుపుతున్న మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సహా నేతల అరెస్టులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. శాంతియుతంగా కొనసాగుతున్న ఉద్యమాన్ని అరెస్టులతో రెచ్చగొడుతున్నారా? అని మండిపడ్డారు.
రాజధానిలో ఉద్రిక్తత: చంద్రబాబు సహా నేతల అరెస్ట్, విడుదల, అసలేం జరిగింది.?
పవన్ కళ్యాణ్ హెచ్చరిక
రాజధాని అమరావతిని రక్షించుకునేందుకు రైతులు చేస్తున్న ఉద్యమాన్ని పోలీసులతో అణచివేయాలని ప్రభుత్వం చూస్తోందని, అందులో భాగంగానే మాజీ సీఎం చంద్రబాబును అరెస్ట్ చేశారని దుయ్యబట్టారు. అరెస్టులు, అణచివేతలాంటి ప్రభుత్వ చర్యలతో శాంతియుతంగా సాగుతున్న ఉద్యమాన్ని హింసాత్మకంగా మార్చే ప్రమాదం ఉందని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
ఉద్యమాన్ని రెచ్చగొట్టేలా..
అమరావతి కోసం భూములు త్యాగం చేసిన రైతులను భయభ్రాంతులకు గురిచేస్తూ మహిళలను, వృద్ధులను పోలీస్ స్టేషన్లకు తరలించడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు రాజధాని గందగోళానికి వైసీపీ ప్రభుత్వం తక్షణమే తెరదించాలని పవన్ కళ్యాణ్ హితవు పలికారు. రాజధాని ప్రాంతంలో రెండుమూడు రోజులుగా చోటు చేసుకుంటున్న ఘటనలు ఉద్యమాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని అన్నారు.
ఉద్యమాలను అణచివేస్తే...
అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాలను అణచివేయాలని చూస్తే మరింత ఉధృతమవుతాయని ప్రభుత్వం గ్రహించాలని సూచించారు. రాజధాని ప్రాంతాన్ని మరో నందిగ్రామ్గా మార్చాలని జగన్ సర్కారు యోచిస్తోందా? అని పవన్ కళ్యాణ్ నిలదీశారు. రాజధాని విషయంలో తక్షణమే స్పష్టతనివ్వాలని, ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని జగన్ సర్కారుకు పవన్ కళ్యాణ్ హితవు పలికారు.
చంద్రబాబు సహా నేతల అరెస్ట్, విడుదల..
బుధవారం రాత్రి అమరావతి పరిరక్షణ సమితి కేంద్ర కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వేదిక కళ్యాణ మండపం వద్ద కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పలువురు టీడీపీ నేతలు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణపాటో పలువురు జేఏసీ నేతలు బస్సు యాత్రను ప్రారంభించేందుకు పాదయాత్రగా బయల్దేరారు. అయితే, వారిని పోలీసులు అక్కడే అడ్డుకున్నారు. ఆ తర్వాత వారిని అరెస్ట్ చేసి వాహనంలో అక్కడ్నుంచి తరలించారు. చంద్రబాబు, నారా లోకేష్, ఇతర టీడీపీ నేతలను వాహనంలో తరలించిన పోలీసులు.. కాసేపటి తర్వాత వారిని ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద విడిచిపెట్టారు. సమాచారం అందడంతో అక్కడికి భారీగా టీడీపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. తదుపరి కార్యాచరణపై చంద్రబాబు సహా నేతలు చర్చించారు.