ప్రిన్స్ మహేశ్ బాబుకు అమరావతి సెగ: ఇంటి ముందు విద్యార్ధుల ఆందోళన: మద్దతివ్వాలంటూ..!
ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదనలు..విశాఖకు పరిపాలనా రాజధాని ఆలోచన పైన నిరసనలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు అవి హైదరాబాద్ లో ఉంటున్న సినీ ప్రముఖలును తాకాయి. టాలీవుడ్ ప్రముఖ హీరోలు సైతం అమరావతికి మద్దతుగా నిలవాలని కోరుతూ ఆందోళనలు మొదలయ్యాయి. హీరో మహేశ్ బాబు ఇంటి ముందు అమరావతికి మద్దతివ్వాలని డిమాండ్ చేస్తూ జై ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థి, యువజన పోరాట సమితి నాయకులు దీక్షకు దిగారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే సంక్రాంతికి విడుదలయ్యే విడుదల పైనా అమరావతి పోరాటంలో ఉన్న వారు హెచ్చరికలు చేస్తున్నారు. తమకు మద్దతివ్వకపోతే..వారి సినిమాలు అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇక, మహేశ్ ఇంటి వద్ద దీక్షకు దిగిన విద్యార్దులను పోలీసులు అరెస్ట్ చేసారు.
ప్రిన్స్ ఇంటి ముందు ధర్నా..అరెస్ట్
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తరలించొద్దని రైతులు చేస్తున్న ఆందోళనకు సినీ నటీనటులు మద్దతివ్వాలని జై ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థి, యువజన పోరాట సమితి నాయకులు దీక్షకు దిగారు. టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు ఇంటి ముందు ఇవాళ ముగ్గురు వ్యక్తులు నిరాహార దీక్ష చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.
మొత్తం 5 డిమాండ్లపై పోరాటంకు సిద్ధమవుతున్నట్లు జై ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థి యువజన పోరాట సమితి ప్రకటించింది.ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఆ ముగ్గుర్నీ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ ముగ్గురు ఆందోళనాకారులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఇప్పటికే తమకు మద్దతుగా నిలవకపోతే సంక్రాంతి సినిమాలు అడ్డుకుంటామంటూ అమరావతి పోరాట సమితి నేతలు హెచ్చరిస్తున్నారు.
19వ తేదీ వరకూ కొనసాగింపు..
అమరావతి తరలింపు ప్రతిపాదనకు వ్యతిరేకంగా మహిళలు పెద్ద సంఖ్యలో నిరసనలు చేస్తున్నారని..వారి పైన ప్రభుత్వం దౌర్జన్యం చేస్తుందని వీరు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఏపీకి చెందిన సినిమా హీరోలు, నటులు స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ్టి నుంచి 19 వరకూ హీరోల ఇంటి ఎదుట ఆందోళన చేస్తామంటూ వారు ప్రకటించారు.
మహేశ్ బాబు నివాసం వద్ద
ధర్నాకు దిగిన ఏపీ విద్యార్థి యువజన పోరాట సమితి తమ డిమాండ్లను ప్రస్తావించింది. వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్ర అభివృద్ధి మండలం ఏర్పాటు చేయాలని .. కర్నూలులో హైకోర్టు అమరావతి వైజాగ్లో హైకోర్టు బెంచీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు. అమరావతిలో రాజధాని కొనసాగించాలని..ఈ పోరాటానికి సినీ ప్రముఖులు మద్దతివ్వాలని అభ్యర్దిస్తున్నారు.