వైసీపీ ఎమ్మెల్యేలు కనిపించటం లేదంటూ: పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు: వెతికిపెట్టాలని కోరుతూ..!
రాజధాని తరలింపు ప్రతిపాదనల పైన మండిపడుతున్న అమరావతి రైతులు స్థానిక వైసీపీ ఎమ్మెల్యేల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా తాము ఆందోళనలు చేస్తున్నా..తమ ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవటం పైన మండిపడుతున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కనిపించటం లేదంటూ ఇప్పటికే ఆ ప్రాంత స్థానికులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.
తాజాగా, తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి కనిపించటం లేదని..ఎక్కడ ఉన్నారో వెతికి పెట్టాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు..స్థానికులు ప్రదర్శనగా తుళ్లూరు పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసారు. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కనిపింటచం లేదంటూ..కుప్పం నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు అక్కడ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చారు.
ఎమ్మెల్యే శ్రీదేవి కనిపించటం లేదంటూ..
తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కనిపించటం లేదంటూ స్థానికులు తుళ్లూరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. వారం రోజులుగా రాజధాని తరలింపు ప్రతిపాదనలకు వ్యతిరేకంగా తాము ఆందోళన చేస్తుంటే..స్థానిక ఎమ్మెల్యే బయటకు రాలేదని పేర్కొన్నారు. తమ ఎమ్మెల్యే ను వెతికి పెట్టాలంటూ వారు ఫిర్యాదులో పోలీసులను కోరారు. మంగళవారం ఇదే విధంగా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే కనిపించ టం లేదంటూ మంగళగిరి పరిధిలోని గ్రామాల రైతులు స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.
ఇక, ఇదే తరహాలో ఇప్పుడు తుళ్లూరు ప్రాంత రైతులు ప్రదర్శనగా వెళ్లి ఆ పోలీసు స్టేషన్ లో తాడికొండ ఎమ్మెల్యే మీద ఫిర్యాదు చేసారు. అటు ముఖ్యమంత్రి తీసుకుంటున్న మూడు రాజధానుల ప్రతిపాదన పైన సమర్ధించలేక.. అదే సమయంలో వ్యతిరేకించలేక రాజధాని ప్రాంత అధికార పార్టీ ఎమ్మెల్యేలు తర్జన భర్జన పడుతున్నారు. వీరి మీద స్థానిక ప్రజల ఆగ్రహం తీవ్ర స్థాయిలో కనిపిస్తోంది.
కుప్పంలో చంద్రబాబు పైన ఫిర్యాదు..
ఇదే సమయంలో చిత్తూరు జిల్లా కుప్పం వైసీపీ కార్యకర్తలు తమ ఎమ్మెల్యే చంద్రబాబు కనిపించటం లేదంటూ స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. తమ ఎమ్మెల్యే అసలు తమ సమస్యలు పట్టించుకోవ టం లేదని..తమకు అందుబాటులో లేరని ఫిర్యాదులో పేర్కొన్నారు. టపాసులు పేలుస్తూ ప్రదర్శనగా వెళ్లి వారు స్థానికంగా ఫిర్యాదు ఇచ్చారు.
ఇక, అమరావతిలో నిరసనల కారణంగా ఆ ప్రాంత అధికార పార్టీ ఎమ్మెల్యేల పైన ఒత్తిడి పెరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో నిరసనల్లో టీడీపీ నేతలు పాల్గొంటుండటం..వైసీపీ ఎమ్మెల్యేలకు సమస్యగా మారింది. అయితే, వారు నిరసనల్లో పాల్గొనేందుకు ముందుకు రావటం లేదు. ఇక, గ్రామాల్లోని ద్వితీయ శ్రేణి నాయకత్వం మాత్రం స్థానిక రైతులు..ప్రజలతో కలిసి ఆందోళనల్లో పాల్గొంటోంది.