రాజధానిగా అమరావతినే .. లేదంటే దూకేస్తాం ..తుళ్ళూరులో సెల్ టవర్ ఎక్కిన నలుగురు యువకులు
ఆంధ్రప్రదేశ్ లో రాజధానిగా అమరావతిని కొనసాగించాలని చేస్తున్న నిరసనలు ఉధృతంగా మారాయి . ఒక పక్క రాజధాని రైతుల పోరాటం ఉధృతంగా సాగుతుంటే, మరో పక్క ప్రభుత్వం రాజధాని విషయంలో తుది నిర్ణయానికి కసరత్తులు చేస్తుంది .మూడు రాజధానుల వైపే మొగ్గు చూపుతుంది. ఇక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని 29 రాజధాని గ్రామాల ప్రజలు ఆందోళనా కార్యక్రమాలను ఉధృతంగా కొనసాగిస్తున్నారు .
క్యాపిటల్ వార్ .. 32వ రోజు .. అసైన్డ్ రైతుల ర్యాలీలు, యజ్ఞాలు, గవర్నర్ కు రాజధాని మహిళల వినతులు
ఇక ఈ నేపధ్యంలో మంగళగిరిలో ప్రజా బ్యాలెట్ కార్యక్రమాన్ని రాజకీయ జేఏసీ ప్రారంభించనుంది. అమరావతి రాజధానిగా ఉండాలనే అంశంపై ప్రజా బ్యాలెట్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత నారా లోకేశ్, జేఏసీ ప్రతినిధులు పాల్గొంటున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఏపీలో పోరాటం చేస్తున్న నలుగురు యువకులు ఈ రోజు తుళ్లూరులో సెల్ టవర్ ఎక్కారు.
అమరావతిని రాజధానిగా కొనసాగించాలని సెల్ టవర్ ఎక్కిన యువకులు నినాదాలు చేస్తున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని లేదంటే క్రిందికి దూకేస్తామని వారు అంటున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భారీ ఎత్తున ప్రజలు, రైతులు అక్కడికి చేరుకుంటున్నారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. టవర్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. ఎమ్మెల్యే శ్రీదేవి వచ్చేంత వరకూ సెల్ టవర్ దిగమని హెచ్చరించారు.శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. వారిని క్రిందకు దించే ప్రయత్నం చేస్తున్నారు.