అమరావతిలో మారిన సీన్: వైసీపీ వైపు కొందరు రైతులు: సీఎం కాన్వాయ్ వెళ్తుండగా..!
అమరావతి: నిన్నటి దాకా నిరసన ప్రదర్శనలు, అసెంబ్లీ ముట్టడి, ఆందోళనలతో అట్టుడికి పోయిన రాజధాని అమరావతి ప్రాంతంలో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయాయి. ఏపీ వికేంద్రీకరణ చట్టాన్ని శాసనసభ ఆమోదించిన మరుసటి రోజే.. అమరావతి పరిధిలోని కొన్ని గ్రామాల్లో ప్రభుత్వానికి సానుకూల వాతావరణం ఏర్పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టిపట్టు ఉన్న అమరావతి గ్రామాలకు చెందిన పలువరు రైతులు వికేంద్రీకరణ చట్టానికి అనుకూలంగా నినాదాలు చేస్తూ కనిపించారు.
పిక్చర్ క్లియర్: వైసీపీ ఒకవైపు: టీడీపీ-కమ్యూనిస్టులు, జనసేన-బీజేపీ మరోవైపు
ప్యాకేజీ పెంపు ఫలితమేనా?
రాజధాని అమరావతి నిర్మాణానికి భూములను ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ప్రతినెలా 2,500 రూపాయల మొత్తాన్ని పరిహారంగా చెల్లిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ ప్యాకేజీ మొత్తాన్ని రెట్టింపు చేసింది జగన్ సర్కార్. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై సచివాలయంలో ఏర్పాటైన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఇకపై పరిహారంగా రైతు కుటుంబాలకు 5,000 రూపాయలను చెల్లిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇన్ని రోజులూ ప్రభుత్వం చెల్లిస్తూ వస్తోన్న ప్యాకేజీ మొత్తాన్ని రెట్టింపు చేయడాన్ని కొన్ని గ్రామాల రైతులు స్వాగతిస్తున్నారు.
పట్టా రైతులతో సమానంగా అసైన్డ్ రైతులకు కూడా ప్యాకేజీ..
2,500 రూపాయల నుంచి 5,000 రూపాయలకు వరకు పెంచిన ఈ ప్యాకేజీ మొత్తాన్ని అసైన్డ్ రైతులకు కూడా వర్తింపజేసింది ప్రభుత్వం. పట్టా రైతులతో సమానంగా అసైన్డ్ భూముల రైతులకూ ఈ పరిహారం ప్యాకేజీని వర్తింపజేసింది. దీనితోపాటు- రాజధాని గ్రామాల్లో భూమిలేని రైతు కూలీలకు కూడా ప్రతినెలా 5,000 రూపాయల మొత్తాన్ని చెల్లించడానికి అంగీకరించింది. దీని ప్రభావం వల్లే అమరావతి పరిధిలోని కొన్ని గ్రామాల రైతులు..వికేంద్రీకరణ చట్టాన్ని స్వాగతిస్తున్నారని చెబుతున్నారు.
థ్యాంక్యూ సీఎం సర్.. అంటూ..
ప్యాకేజీ పెంపు ప్రభావం వల్ల కొన్ని గ్రామాల రైతులు వికేంద్రీకరణ చట్టానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. మంగళవారం ఉదయం అసెంబ్లీకి వెళ్లే దారిలో, రోడ్డుకు ఇరువైపులా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ల చిత్రపటాలను పట్టుకుని నిల్చున్నారు. థ్యాంక్యూ సీఎం సర్.. అనే అక్షరాలు రాసి ఉన్నాయి ఆ ఫొటోల మీద. వైఎస్ జగన్ కాన్వాయ్ వచ్చేంత వరకూ వారు ఎదురు చూశారు. కాన్వాయ్ రాగానే.. జగన్కు అనుకూలంగా నినాదాలు చేశారు.
ఊపీరి పీల్చుకుంటోన్న వైసీపీ నేతలు..
వికేంద్రీకరణ చట్టాన్ని శాసనసభ ఆమోదించిన తరువాత.. అమరావతి పరిధిలోని కొన్ని గ్రామాల్లో పార్టీకి, ప్రభుత్వానికి అనుకూల వాతావరణం ఏర్పడటం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఊపిరి పోసినట్టయింది. సుమారు 34 రోజుల పాటు అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో నెలకొన్న వాతావరణం, వ్యతిరేకతను ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతమయ్యారు వైసీపీ నాయకులు. వికేంద్రీకరణ చట్టాన్ని శాసనసభ ఆమోదించిన తరువాత.. దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉండొచ్చని అనుమానించారు. దీనికి భిన్నంగా కొన్ని గ్రామాల్లో పార్టీకి అనుకూల వాతావరణం ఏర్పడటంతో ఊపిరి పీల్చుకుంటున్నారు.
తెలుగుదేశం పరిస్థితేంటీ?
తాజాగా నెలకొన్న పరిణామాలు తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగించేవేనని వైఎస్ఆర్సీపీ నాయకులు చెబుతున్నారు. 29 గ్రామాల రైతులు కూడా మూడు రాజధానుల ఏర్పాటు పట్ల వ్యతిరేకంగా లేరనే విషయాన్ని తాము ముందు నుంచీ చెబుతూనే వస్తున్నామని గుర్తు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి పట్టు ఉన్న కొన్ని గ్రామాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను మాత్రమే మీడియా ప్రసారం చేస్తూ వచ్చిందని, దాని వల్లే అమరావతి వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందనే భావన ఏర్పడిందని వ్యాఖ్యానిస్తున్నారు. కొన్ని గ్రామాల రైతులు పార్టీకి అండగా ఉండటం గొప్ప విషయంగా అభివర్ణిస్తున్నారు.