అమరావతి డిక్లరేషన్ ఆవిష్కరణ నేడే...సిఎం,స్పీకర్ తో సహా హాజరుకానున్న వివిధ రంగాల ప్రముఖులు
అమరావతి: సమాజంలో వివిధ రంగాల్లో ఉన్న మహిళలు, యువతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలను సూచించేందుకు అమరావతి డిక్లరేషన్ వేదికగా నిలవనుందని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చెప్పారు. పుస్తక రూపంలో పొందుపరచిన అమరావతి డిక్లరేషన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సాయంత్రం ఆవిష్కరించనున్నట్లు శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. వివిధ రంగాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, భవిష్యత్తులో రూపొందించే చట్టాలకు అమరావతి డిక్లరేషన్ సూచికగా నిలుస్తుందన్నారు.
Recommended Video
మహిళల కోసం సమగ్రంగా...
ఈ ఏడాది ఫిబ్రవరిలో పవిత్రసంగమం వద్ద వుమెన్స్ పార్లమెంట్ సదస్సులోనే మహిళల కోసం ఒక సమగ్ర డిక్లరేషన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో విభిన్న రంగాలకు చెందిన మహిళలు తెలియచేసిన అభిప్రాయాల్ని, ఆ సదస్సులో జరిగిన చర్చలు, సిఫార్సుల్ని సంక్షిప్తంగా అమరావతి డిక్లరేషన్ లో పొందుపరిచినట్లు స్పీకర్ కోడెల తెలిపారు. ఈఇందులో మహిళల ఆరోగ్యం, విద్య, పౌష్టికాహారం, రక్షణ, రాజకీయాలు, పరిశోధనల్లో భాగస్వామ్యం, సామాజిక భద్రత, స్థిరమైన అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం, పారిశ్రామిక రంగం వంటి మొత్తం పది రంగాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పలు సూచనలు చేశారన్నారు.
విఐపిల రాక....
ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబునాయుడు, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, కేంద్ర శాస్త్ర, సాంకేతిక స్టేట్ మంత్రి సుజనాచౌదరి, బాలల హక్కుల ఉద్యమవేత్త కైలాస్ సత్యార్ధి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ అరుంధతి భట్టాచార్య, యునిసెఫ్ ప్రతినిధి మెల్తల్ రుసిడియ, అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చైర్పర్సన్ డాక్టర్ వి.శాంత. భారతీయ చెస్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి, ప్రపంచ నెంబరు-2 బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్లు గౌరవ అతిథులుగా హాజరుకానున్నారు.
పటిష్ట భద్రతా ఏర్పాట్లు...
అమరావతి డిక్లరేషన్ అవిష్కరణ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు, స్పీకర్తో సహా వివిధ రంగాల ప్రముఖులు హాజరు కానుండటంతో వారిని ప్రొటోకాల్ మర్యాదలతో సభా ప్రాంగణానికి తీసుకురావడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పది వేల మంది మహిళలను, విద్యార్ధినిలను ఇక్కడకు తీసుకురావడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వారందరినీ బస్సులలో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న వేదికను పోలీసుల సూచనల మేరకు నిర్మిస్తున్నారు.విఐపిల రాక దృష్ట్యా భారీ బందోబస్తు,పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని మెటల్ డిటెక్టర్లతో పరీక్షించిన తరువాతే లోపలికి అనుమతిస్తారు.