మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మోసం - 420 కేసు పెట్టాలని రెండు పీఎస్ల్లో అమరావతి రైతుల ఫిర్యాదు..
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం జరుగుతున్న ప్రయత్నాలపై ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా.. అమరావతి ప్రాంతంలో మాత్రం వైసీపీ ప్రజాప్రతినిధులకు చుక్కలు కనిపిస్తున్నాయి. గత డిసెంబర్ లో మూడు రాజధానుల ప్రకటన తర్వాత దాదాపు ప్రజల్లో తిరగడం మానేసిన ఈ ప్రాంతానికి చెందిన వైసీపీ ప్రజాప్రతినిధులపై రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.
దీంతో తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై స్ధానిక రైతులు టౌన్, రూరల్ పీఎస్ లలో ఫిర్యాదు చేశారు. రాజధాని అమరావతిలోనే ఉంటుందంటూ తమను నమ్మించి ఓట్లు వేయించుకుని ఇప్పుడు రాజధానిని ఏకపక్షంగా తరలిస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే ఫిర్యాదుతో ఆర్కేపై 420 కేసు పెట్టాలని పీఎస్ లలో ఫిర్యాదులు చేశారు.
Recommended Video
రాజధాని తరలింపుపై తమ ఆవేదన చెప్పుకునేందుకు ఎమ్మెల్యే ఆర్కే అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నారని రైతులు తమ ఫిర్యాదులో ఆరోపించారు. రాజధాని విషయంలో తమను నమ్మించి మోసం చేసిన ఆర్కేపై ఛీటింగ్ కేసు నమోదు చేయాలంటూ రైతులు చేసిన ఫిర్యాదుపై మంగళగిరి టౌన్, రూరల్ పోలీసులు ఉన్నతాధికారులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.