మూడో రోజుకు చేరిన రాజధాని రైతుల ఆమరణ నిరాహార దీక్ష:ఏకైక డిమాండ్
అమరావతి:తమ భూములను ఎంజాయ్మెంట్ సర్వేలో నమోదు చేయాలంటూ రాజధాని అసైన్డ్ భూముల రైతులు చేపట్టిన అమరణ నిరహార దీక్ష మంగళవారం నాటికి మూడో రోజుకి చేరుకుంది.
దీక్ష చేపట్టిన తమ కుటుంబ సభ్యుల షుగర్, బీపీ లెవల్స్ పడిపోవడం వారి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని రాజధాని రైతుల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా ప్రభుత్వం నుంచి కనీసం స్పందన లేదని వారు వాపోయారు. మరోవైపు రైతులు చేపట్టిన ఈ దీక్షకు వైసిపి తోపాటు, వామపక్షాలకు చెందిన నాయకులు సంఘీభావం తెలిపిన సంగతి తెలిసిందే.
రాజధాని ప్రకటన సమయంలో చేసిన ఎంజాయ్మెంట్ సర్వేలో తమ భూములు నమోదు చేయకుండా అధికారులు, అధికార పార్టీ నాయకులు కక్ష పూరితంగా వ్యవహరించారని దీక్ష చేస్తున్న రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు చెందిన 49 ఎకరాల భూములకు చుట్టు పక్కల ఉన్న భూములన్నింటినీ సర్వేలో నమోదు చేసి...కేవలం తమ భూములను మాత్రం చేయకపోవడానికి ప్రధాన కారణం తమ భూములపై టీడీపీ నేతల కన్నుపడటమేనని ఈ రైతులు ఆరోపిస్తున్నారు.
ఇదిలావుండగా లింగాయపాలెంలో అసైన్డ్భూముల రైతుల ఆమరణ దీక్షకు వైయస్ఆర్సీపీ, వామపక్షాలు సంఘీభావం ప్రకటించాయి. రాజధాని పేరుతో రైతుల భూములు తీసుకుని ఏం చేశారని వైయస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని పేరిట దళితులకు అన్యాయం చేస్తుందని వైసిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటివరుకు ఏం చేశారో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. అసైన్డ్ భూముల రైతులకు తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. వైయస్ జగన్ సీఎం కాగానే ఈ రైతులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. అసైన్డ్ భూములకు ఎంజాయ్మెంట్ సర్వే చేయాల్సిందేనని పునరుద్ఘాటించారు. ఇదే విషయమై రైతులు మూడేళ్లుగా కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు.