అమరావతి ఫ్లాట్లు ముందా ? పేదల ఇళ్లస్ధలాల పంపిణీ ముందా ? కీలకంగా హైకోర్టు తీర్పు !
ఏపీలో సీఆర్డీయే చట్టం ప్రకారం అమరావతి రాజధానిని అభివృద్ధి చేసే విషయంలో మల్లగుల్లాలు పడుతున్న ప్రభుత్వం పేదలకు ఇళ్లస్ధలాల కేటాయింపు కోసం చేస్తున్న ప్రయత్నాలు హైకోర్టుకు చేరాయి. అమరావతిలో ముందుగా రైతులకు అభివృద్ధి చేసిన ఫ్లాట్లు కేటాయించాలా లేక ఇతర ప్రాంతాల పేదలకు ఇళ్ల స్ధలాలు కేటాయించాలా అన్న అంశంపై హైకోర్టులో తాజాగా ఆసక్తికర వాదనలు సాగాయి. దీంతో ఈ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చే తీర్పు కీలకంగా మారింది.
అమరావతిలో ఫ్లాట్ల కేటాయింపు
అమరావతిలో రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ఫ్లాట్లు ఇచ్చేలా గతంలో టీడీపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే దానికి భిన్నంగా ఆయా భూముల్లో పేదలకు ఇళ్ల స్ధలాలు ఇవ్వాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కొత్త వివాదం మొదలైంది. రాజధానిలో ఇతరులకు భూములివ్వాలా వద్దా అన్న దానిపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. అదే సమయంలో ముందుగా రైతులకు ఫ్లాట్లు ఇవ్వాలా, పేదలకు ఇళ్ల స్ధలాలు ఇవ్వాలా అన్న దానిపైనా హైకోర్టులో వాదనలు సాగాయి. ఇందులో ప్రభుత్వం, సీఆర్డీయే తాజాగా తమ వాదనలు వినిపించాయి.
ముందు తమకు ఫ్లాట్లే ఇవ్వాలంటున్న రైతులు
గతంలో ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అమరావతిలో తమకు అభివృద్ధి చేసిన ఫ్లాట్లు ఇచ్చాకే మిగిలిన పంపకాలు చేసుకోమని రైతులు చెప్తున్నారు. ఇందుకు విరుద్ధంగా వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని రైతులు తప్పుబడుతున్నారు. హైకోర్టులోనూ ఇదే వాదన వినిపిస్తున్నారు. సీఆర్డీయే చట్టం ప్రకారం తమకు ఫ్లాట్లు ఇవ్వకుండా ఇతరులకు భూముల పంపకాలు చేయడం నిబంధనలకు విరుద్ధమని చెప్తున్నారు. దీంతో ఈ వ్యవహారంలో పీటముడి పడింది. దీనిపై తాజాగా హైకోర్టులోనూ ప్రభుత్వం, సీఆర్డీయే తీరును రైతుల తరఫున న్యాయవాది తీవ్ర అభ్యంతరం తెలిపారు.
పేదల స్దలాలే ముందన్న ప్రభుత్వం
అమరావతిలో పేదల ఇళ్ల స్ధలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో తమ వాదన వినిపించింది. ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి పేదలకు అమరావతిలో ఇళ్ల స్ధలాలు ముందుగా కేటాయించడాన్ని సమర్ధించుకున్నారు. రైతులకు ముందుగా అభివృద్ధి చేసిన ఫ్లాట్లు ఇచ్చాకే పేదలకు ఇళ్ల స్ధలాలు కేటాయించాలన్న వాదనను తప్పుబట్టారు. ఆ డిమాండ్ సరికాదన్నారు. అలాంటి నిబంధన సీఆర్డీయే చట్టంలో లేదన్నారు. రైతులు రాజధాని కోసం ఇచ్చిన భూముల్లో ఐదు శాతం పేదల ఇళ్ల స్దలాలకు ఇచ్చుకోవచ్చన్నారు. రాజధాని ప్రాంతంలో పలు గ్రామాలు పీఎంఈవై పథకం కిందకు వస్తాయని, ఇందులో పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నది ప్రభుత్వ ఉద్దేశమన్నారు.
కీలకంగా హైకోర్టు తీర్పు ?
ఓవైపు రైతులు తమతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ముందుగా తమకు ఫ్లాట్లు ఇవ్వాలని కోరుతుంటే, ప్రభుత్వం మాత్రం పేదలకు ఇళ్ల స్ధలాలు ఇచ్చాకే మీ సంగతి చూస్తామని చెబుతోంది. దీంతో ఈ వ్యవహారంపై హైకోర్టు ఇచ్చే ఉత్తర్వులు కీలకంగా మారాయి. అసలే సుప్రీంకోర్టులో అమరావతి పిటిషన్లపై కీలక విచారణ జరుగుతోంది. గతంలో హైకోర్టు కూడా రాజధాని భూముల్ని ఇతరులకు పంచడాన్ని తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇవ్వబోయే ఉత్తర్వులు కచ్చితంగా కీలకంగా మారబోతున్నాయి. ప్రభుత్వానికి ఇవి అనుకూలంగా రాకపోతే మాత్రం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే జరిగితే అమరావతి పిటిషన్లతో పాటు ఈ వ్యవహారం కూడా సుప్రీంకోర్టుకు చేరుతుంది.