కారుణ్య మరణానికి అనుమతించండి: రాష్ట్రపతికి రైతుల లేఖలు: జాతీయ స్థాయిలో సంచలనం..!
Recommended Video
ఏపీ ప్రభుత్వం అమరావతి నుండి రాజధాని తరలింపు..మూడు రాజధానుల ప్రతిపాదనల పైన 15 రోజులుగా ఆందోళన చేస్తున్న అమరావతి రైతులు మరో సంచలనానికి కారణమయ్యారు. రాజధాని విషయంలో మోసపోయిన తమకు కారుణ్య మరణానికి అనుమతి కోరుతూ రాష్ట్రపతికి అమరావతి రైతుల లేఖలు రాసారు. అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ మాట మార్చారని వారు తమ లేఖల్లో వాపోయారు.
ఇప్పటికే తమ ఆందోళనను స్వయంగా కలిసి రాష్ట్రపతికి వివరించిన రైతులు..ఇప్పుడు లేఖల ద్వారా కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోరటం సంచలనంగా మారింది. జాతీయ స్థాయిలో ఇప్పటికే ఏపీ రాజధానుల వ్యవహారం పైన చర్చ సాగుతోంది. తాజాగా రైతుల ఈ లేఖలు..చర్చనీయాంశంగా మారుతున్నాయి.
కారుణ్య మరణానికి అనుమతి కోరుతూ..
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు అమరావతి ప్రాంత రైతులు లేఖలు రాసారు. కారుణ్య మరణానికి అనుమతి కోరుతూ రాష్ట్రపతికి అమరావతి రైతుల రాసిన లేఖలు ఇప్పుడు సంచలనగా మారాయి. రాజధాని విషయంలో మోసపోయినందున చనిపోయే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేసారు. ముఖ్యమంత్రి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో మేమంతా ఉన్నపళంగా రోడ్డున పడ్డామని లేఖలో వివరించిన రైతులు..అధికారంలోకి వచ్చాక జగన్ మాట మార్చారంటూ లేఖలో ఆవేదన వ్యక్తం చేసారు.
కేవలం ముఖ్యమంత్రి.. పలువురు వ్యక్తుల స్వలాభం కోసం రాజధానిని విశాఖకు తరలించే కుట్ర చేస్తున్నారంటూ ఆ లేఖల్లో పేర్కొన్నారు. రాజధాని మార్చవద్దంటూ మా కుటుంబాలతో కలిసి 14 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా తమను పట్టించుకున్నవారు లేరంటూ ఆవేదన వ్యక్తం చేసారు. తమ గోడు వినిపించుకున్న వారు లేరుంటూ ఆక్రోశించారు.
కులం..ప్రాంతం అంటగడుతున్నారు..
తాము రాజధాని కోసం భూములిస్తే..తమ ఆవేదన అర్దం చేసుకోకుండా..అధికార పార్టీ నేతలు మా త్యాగాన్ని హేళన చేస్తున్నారంటూ రాష్ట్రపతికి రాసిన లేఖలో రైతులు ఆవేదన వ్యక్తం చేసారు. తమకు.. కులం.. మతం.. ప్రాంతం అంటగడుతున్నారంటూ ఫిర్యాదు చేసారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నశాసన సభాపతి ..మంత్రులు ..ఎమ్మెల్యేలు రాజధాని స్మశానం అని ఒకర.., ఎడారి అని ఇంకొకరు..ఆందోళన చేస్తున్న రైతులు పెయిడ్ ఆర్టిస్టులు అని మరొకరు ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని తమ లేఖల్లో వివరించారు. ఇదేమిటని ప్రశ్నిస్తే మాపై దాడులకు దిగుతున్నారని ఫిర్యాదు చేసారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అర్ధరాత్రి మా ఇళ్లపైకి పోలీసులను పంపి తమను జైళ్లలో పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. అక్రమంగా హత్యాయత్నం కేసులు నమోదు చేస్తున్నారని పేర్కొన్నారు. తమ పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకమైందని లేఖలో వివరించారు.
జీవచ్ఛవాలుగా మిగిలిపోతాం...
తమకు అండగా నిలవాల్సిన ప్రభుత్వమే తమపై కక్ష కట్టిందని ఆరోపించారు. ఒక మంచి కార్యం కోసం మేం చేసిన త్యాగాలకు దక్కిన ఫలితమంటూ ఆవేదన వ్యక్తం చేసారు. రాజధాని తరలిపోతే తాము జీవచ్ఛవాలుగా మిగిలిపోతామని ఆవేదన చెందారు. ఈ బతుకులు మాకొద్దు...ఇక మాకు మరణమే శరణ్యమని లేఖల్లో పేర్కొన్నారు.తమ యందు దయ ఉంచి కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండంటూ రాజధాని ప్రాంత రైతులు రాష్ట్రపతి భవన్ కు రాసిన లేఖల్లో అభ్యర్ధించారు. ఇప్పుడు ఈ వ్యవహారం పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.