జస్టిస్ రాకేశ్ కుమార్కు అమరావతి రైతుల ఘన వీడ్కోలు- గిఫ్టులతో ఎదురొచ్చి
నిన్న పదవీ విరమణ చేసిన ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్కు అరుదైన గౌరవం లభించింది. ప్రభుత్వ అధికారులు, జడ్డిలు పదవీ విరమణ చేసినప్పుడు వారితో కలిసి పనిచేసిన వారు ఘనంగా వీడ్కోలు ఇచ్చి సాగనంపుతారు. కానీ ఆయనకు మాత్రం సహచర న్యాయమూర్తులు, సిబ్బందితో పాటు ఆయన వాదించిన కేసుల్లో పిటిషనర్లుగా ఉన్న అమరావతి రైతుల నుంచి కూడా ఘనమైన వీడ్కోలు లభించింది.
నిన్న పదవీ విరమణ చేసిన తర్వాత హైకోర్టులో జస్టిస్ రాకేష్ కుమార్ను ఛీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరితో పాటు ఇతర న్యాయమూర్తులు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. తన పదవీకాలంలో జస్టిస్ రాకేష్ కుమార్ ఇచ్చిన పలు తీర్పులు న్యాయవ్యవస్ద గౌరవాన్ని నిలబెట్టేలా ఉన్నాయని వారు ప్రశంసించారు. సన్మానం అనంతరం హైకోర్టు నుంచి బయలు దేరిన ఆయనకు నేలపాడులో అమరావతి రైతులు ఎదురయ్యారు. రాకేష్ కుమార్ కారు కనిపించగానే దండాలు పెడుతూ న్యాయం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.
రైతులను చూడగానే జస్టిస్ రాకేష్ కుమార్ కూడా కారు ఆపి వారిని ఆప్యాయంగా పలకరించారు. కారు అద్దం దింపి వారు తెచ్చిన శాలువా, ఇతర బహుమతులను తీసుకున్నారు. వారిని పోరాటం కొనసాగించాలని సూచించారు. తన పదవీకాలంలో రైతులు చూపించిన అభిమానానికి చేతులెత్తి మొక్కారు. కాసేపు వారితో ముచ్చటించాక అక్కడి నుంచి బయలు దేరి వెళ్లిపోయారు. రాకేష్ కుమార్ కారు వెళ్లే వరకూ రైతులు జై జై నినాదాలు చేశారు.
ఏపీ సర్కారు తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పలు కేసుల విచారణ హైకోర్టులో సాగుతోంది. అయితే వీటిలో నేరుగా ఆయన విచారణ చేయకున్నా.. అమరావతిలో పేదలకు ఇళ్ల స్ధలాల కేటాయింపుకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ఆయన తప్పుబట్టారు. అమరావతి రైతులపై నమోదు చేసిన కేసుల విషయంలోనూ జస్టిస్ రాకేష్ కుమార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులిచ్చారు. దీంతో రైతులు కూడా ఆయనతో పాటు ఛీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరిని కూడా ఆరాధించడం మొదలుపెట్టారు. ఇప్పటికే అమరావతి గ్రామాల్లో వారి చిత్రపటాలకు పూలమాలలు వేస్తున్నారు.