మెగాస్టార్ అండ్ టాలీవుడ్ టీమ్కు అమరావతి రైతుల పోరాట సెగ: మిట్టమధ్యాహ్నం గెస్ట్హౌస్ వద్ద
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశం కావడానికి రాజధాని అమరావతి ప్రాంతానికి చేరుకున్న తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలకు అమరావతి ప్రాంత రైతులు తమ ధర్నా రుచి చూపించారు. మిట్టమధ్యాహ్నం ఎండ వేడిమిని సైతం లెక్క చేయకుండా అమరావతి ప్రాంత రైతులు టాలీవుడ్ ప్రముఖులకు తమ డిమాండ్లను వినిపించారు. అమరావతిని పూర్తిస్థాయి రాజధానిగా కొనసాగించేలా వైఎస్ జగన్పై ఒత్తిడిని తీసుకుని రావడం, తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని వారు పట్టుబట్టారు.
చంద్రబాబు బుజ్జగించినా..డోన్ట్కేర్: వైసీపీలోకి మాజీమంత్రి శిద్ధా రాఘవరావు: కండువా రేపే
ముఖ్యమంత్రిని కలుసుకోవడానికి టాలీవుడ్ ప్రముఖలతో టీమ్ ఈ మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, రాజమౌళి తదితరులు ఈ టీమ్లో ఉన్నారు. దీనికి చిరంజీవి సారథ్యాన్ని వహిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు వారు వైఎస్ జగన్తో సమావేశం కావాల్సి ఉంది. దీనికోసం హైదరాబాద్ నుంచి బయలుదేరిన టాలీవుడ్ టీమ్ విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది.
విమానాశ్రయం నుంచి బయటికి వచ్చిన వెంటనే వారు నేరుగా గుంటూరు జిల్లా ఉండవల్లికి బయలుదేరి వెళ్లారు. ఉండవల్లి కరకట్ట సమీపంలో నిర్మించిన గోకరాజు గంగరాజు గెస్ట్హౌస్లో బస చేశారు. అదే సమయంలో అమరావతి ప్రాంత రైతులు పెద్దఎత్తున గోకరాజు గంగరాజు అతిథిగృహానికి చేరుకున్నారు. గేటు బయట బైఠాయించారు. ప్లకార్డులను ప్రదర్శించారు.170 రోజులకు పైగా తాము నిరసనలను కొనసాగిస్తున్నామని అన్నారు. మూడు రాజధానులు వద్దు.. అమరావతి ముద్దు అనే ప్లకార్డులను ప్రదర్శించారు.
రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ తాము పోరాటాన్ని కొనసాగిస్తున్నామని, చిత్ర పరిశ్రమ పెద్దలు తమకు అండగా నిలవాలని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. అమరావతిని రాజధానిగా కొనసాగించడంపై టాలీవుడ్ తన వైఖరిని ఇంకా స్పష్టం చేయలేదని, ఇంకెప్పుడు తేల్చుతారని వారు నిలదీశారు. టాలీవుడ్ ప్రముఖుల వాహనాలను గెస్ట్హైస్ వద్ద అడ్డుకోవడానికి ప్రయత్నించారు. గేటు దాటుకుని లోపలకు వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీనితో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మూడు రాజధానుల ఏర్పాటుపై చిత్ర పరిశ్రమల పెద్దలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి మూడు రాజధానుల వైపే మొగ్గు చూపారు. మూడు రాజధానులను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రం సమాన అభివృద్ధి సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. అమరావతి రైతుల నిరసనలకు వ్యతిరేకంగా చిరంజీవి తన అభిప్రాయాలను తెలియజేయడాన్ని తప్పు పడుతూ రైతుల పరిరక్షణ సమితి ప్రతినిధులు ఇదివరకు హైదరాబాద్లోని చిరంజీవి నివాసం వద్ద ధర్నా కూడా చేశారు.
Recommended Video
చిరంజీవికి తాకిన రాజధాని ప్రాంత రైతుల సెగ pic.twitter.com/v5RsXsGfxS
— oneindiatelugu (@oneindiatelugu) June 9, 2020
అశ్వనీదత్ వంటి కొందరు సినీ పెద్దలు అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ డిమాండ్ చేశారు. ప్రత్యక్షంగా అమరావతి ప్రాంత రైతుల ఉద్యమంలో పాల్గొన్నారు. పూర్తిస్థాయి రాజధానిగా అమరావతిని కొనసాగించడంపై టాలీవుడ్ పెద్దల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనితో తమ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తూ అమరావతి ప్రాంత రైతులు పెద్ద ఎత్తున గోకరాజు గంగరాజు గెస్ట్హౌస్ వద్ద నిరసన ప్రదర్శనలను చేపట్టారు.