అమరావతిలో మరో అలజడి-భూముల అమ్మకాలు, లీజుల నిర్ణయాలతో -మళ్లీ హైకోర్టుకు రైతులు
ఏపీ రాజధాని అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసే క్రమంలో ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భూముల అమ్మకంతో పాటు ఇప్పటికే నిర్మించి భవనాల్ని అద్దెకు ఇవ్వడం వంటి నిర్ణయాలు ఉన్నాయి. దీంతో రాజధాని రైతులు ఈ నిర్ణయాల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు హైకోర్టు తీర్పుకు వ్యతిరేకమంటున్న రైతులు... మళ్లీ న్యాయస్ధానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు.
అమరావతిలో మళ్లీ అలజడి
అమరావతిలో టీడీపీ ప్రభుత్వం తలపెట్టిన రాజధాని నిర్మాణం టీడీపీ అధికారం కోల్పోవడంతో మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ సర్కార్ విశాఖలో రాజధాని నిర్మిస్తామన్న పేరుతో అమరావతిని తీవ్రంగా నిర్లక్ష్యం చేసింది. ఆయితే మధ్యలో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో మళ్లీ అమరావతిపై దృష్టిసారించింది. అయితే ఈసారి అమరావతిపై అభివృద్ధిపై కాకుండా భూముల అమ్మకాలు, అప్పటికే నిర్మించి ఉన్న క్వార్టర్లను లీజుకు ఇవ్వడం వంటి నిర్ణయాలు తీసుకుంటోంది. దీనిపై స్ధానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఎకరా 10 కోట్లకు భూముల అమ్మకం
అమరావతిలో అభివృద్ధి పనుల కోసమంటూ ఎకరాను రూ.10 కోట్ల చొప్పున అమ్మేందుకు ప్రభుత్వం సీఆర్డీయే ద్వారా ఏర్పాట్లు చేస్తోంది. అయితే అమరావతిలో రాజధాని నిలిచిపోయిన క్రమంలో ఇప్పుడు అక్కడ అంత రేట్లు పలకడం లేదు. అదే సమయంలో కొత్తగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్ధలేవీ అమరావతివైపు చూడటం లేదు. దీంతో ఇక్కడ భూముల్ని అమ్మేసుకుని బయటపడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. తమ పోరాటం ఫలితంగా హైకోర్టు రాజధానిని అమరావతిగానే నిర్ణయించిన తర్వాత ప్రభుత్వం ఇలా భూముల్ని అమ్ముకుంటూ పోతే తమ పరిస్ధితి ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు.
లీజుకు ప్రభుత్వ క్వార్టర్లు
అమరావతిలో గత టీడీపీ ప్రభుత్వం అధికారుల కోసం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం పలు క్వార్టర్లు నిర్మించింది. అయితే ఇవి మూడేళ్లుగా ఖాళీగా పడి ఉన్నాయి. వీటిని ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం వద్ద సరైన ప్రణాళిక లేకపోవడంతో అవి దెబ్బతినే పరిస్దితికి వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం హైకోర్టు తీర్పును అడ్డుపెట్టుకుని ఇక్కడ ఉన్న ప్రభుత్వ క్వార్టర్లను ప్రైవేటు సంస్ధలకు లీజుకు ఇచ్చేందుకు సిద్ధమైంది. తొలి విడతలో ఏడాదికి రూ.10 కోట్లకు విట్స్ యూనివర్సిటీకి ఇచ్చేందుకు ఓ భవనం రెడీ చేస్తున్నారన్న వార్తలు రాజధానిలో కలకలం రేపాయి.
మళ్లీ హైకోర్టుకు రైతులు
అమరావతి రాజధానిలో హైకోర్టు తీర్పుకు విరుద్ధంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై రైతులు మండిపడుతున్నారు. భూముల అమ్మకం, క్వార్టర్ల లీజు వంటి నిర్ణయాల ద్వారా తమకు భవిష్యత్తులో తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళనలో ఉన్నారు. దీంతో ప్రభుత్వ నిర్ణయాల్ని సవాల్ చేస్తూ మరోసారి హైకోర్టును ఆశ్రయించాలని రైతులు భావిస్తున్నారు. ఈ మేరకు త్వరలో పిటిషన్ దాఖలు చేయనున్నారు. గతంలో రాజధానిపై ఇచ్చిన తీర్పును ప్రభుత్వం సమగ్రంగా అమలు చేసేలా చూడాలని వారు హైకోర్టును కోరబోతున్నారు.