అమరావతి శంకుస్థాపన పట్టపగలే మోసం, కెసిఆర్ రాక ఒక్కటే: జెపి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి జరిగిన శంకుస్థాపన కార్యక్రమం ఒక డ్రామాలా జరిగిందని లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ విమర్శించారు. ప్రత్యేక హోదా, పన్ను రాయితీల గురించి ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టంగా హామీ ఇస్తూ ప్రకటించకపోవడం ఆంధ్రప్రజలను పట్టపగలే మోసం చేయడమని అన్నారు.
శుక్రవారం నాడిక్కడ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు ప్రధాని శంకుస్థాపన కార్యక్రమంలో ఏదో ఒక గట్టి మేలు జరగబోతోందని నమ్మినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు. బాబు అడగలేదు, మోడీ ఇవ్వాలేదని లోక్సత్తా నేత ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం ఒక్కటే సుహృద్భావ వాతావరణంలో జరిగింది తప్ప మిగిలినది అంతా ఆశించిన స్థాయిలో లేదని అన్నారు.
ఎపికి రావాల్సిన వాటి గురించి కనీసం చంద్రబాబు ప్రధానిని ప్రశ్నించనే లేదని అన్నారు. కేంద్రం నుంచి వచ్చిన 100 కోట్లు, 1000 కోట్లు సహాయమే అదృష్టమని, మీ వల్లే మేం బతుకుతున్నామనే రీతిలో సిఎం చంద్రబాబు వేదికపై ఉపన్యాసం చేయడం ఇంకా దారుణమని అన్నారు. మభ్యపెట్టే రీతిలో మొదటి నుంచీ మోడీ ప్రభుత్వం ఎపిని మోసం చేస్తూ వస్తోందని అన్నారు.
రాయలసీమ, ఉత్తరాంధ్రకు చెందిన 7 జిల్లాలు ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాల కన్నా అధ్వాన్న స్థితిలో ఉన్నాయని జెపి చెప్పారు. అందుకు ఆయన గణాంకాలను తెలియజేశారు. విభజన వల్ల ఎపికి సంభవించిన రెవెన్యూ లోటు పూడ్చే అంశంలో కూడా కేంద్రం మొండి చెయ్యి చూపించిందని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన పిసరంత కూడా ఎపికి ఇవ్వకపోవడం కేంద్రప్రభుత్వ దగాకోరు విధానానికి నిదర్శనమని అన్నారు.
తెలుగుదేశం, బిజెపిల పరిస్థితి ఎపిలో ఏరుదాటాక తెప్ప తగలేసిన చందాన ఉందని విమర్శించారు.ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి గురించి మోదీ మాట్లాడలేదని, ప్రధాని హోదాపై స్పష్టత ఇవ్వలేదని లోక్సత్తా నేత జయప్రకాష్ నారాయణ అన్నారు. రాజధాని అంటే కేవలం అమరావతే కాదని జేపీ అన్నారు.